RR vs GT : ఓ వైపు వైభవ్ విధ్వంసకాండ కొనసాగుతుండగానే.. జైస్వాల్ అరుదైన రికార్డు..
యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా సోమవారం సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే శతకం చేసి రాజస్థాన్ రాయల్స్కు అద్భుత విజయాన్ని అందించాడు. ఓ వైపు ఈ కుర్రాడి విధ్వంసం కొనసాగుతుండగానే మరోవైపు యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ కేవలం 40 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 70 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో అతడు ఐపీఎల్లో అత్యంత వేగంగా 2 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. కాగా.. అతడు చేసిన పరుగులు అన్ని రాజస్థాన్ రాయల్స్ తరుపున చేసినవే. యశస్వి ఐపీఎల్ (2020) అరంగ్రేటం నుంచి కూడా రాజస్థాన్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ఈక్రమంలో రాజస్థాన్ తరఫున అత్యంత వేగంగా 2వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 62 ఇన్నింగ్స్ల్లోనే జైస్వాల్ ఈ ఘనత సాధించాడు. అతడి కన్నా ముందు ఆర్ఆర్ తరుపున సంజూ శాంసన్ (3966), జోస్ బట్లర్ (3055), అజింక్యా రహానే (2810), షేన్ వాట్సన్ (2372) మాత్రమే ఈ ఘనత అందుకున్నారు.
ఐపీఎల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్ల పరంగా) 2వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాళ్లు వీరే..
క్రిస్ గేల్ – 48 ఇన్నింగ్స్ల్లో
షాన్ మార్ష్ – 52 ఇన్నింగ్స్ల్లో
రుతురాజ్ గైక్వాడ్ – 57 ఇన్నింగ్స్ల్లో
కేఎల్ రాహుల్ – 60 ఇన్నింగ్స్ల్లో
యశస్వి జైస్వాల్ – 62 ఇన్నింగ్స్ల్లో
ఐపీఎల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్ల పరంగా) 2వేల పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
రుతురాజ్ గైక్వాడ్ – 57 ఇన్నింగ్స్ల్లో
కేఎల్ రాహుల్ – 60 ఇన్నింగ్స్ల్లో
యశస్వి జైస్వాల్ – 62 ఇన్నింగ్స్ల్లో
సచిన్ టెండూల్కర్ – 63 ఇన్నింగ్స్ల్లో
రిషబ్ పంత్ – 64 ఇన్నింగ్స్ల్లో
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ (84), జోస్ బట్లర్ (50 నాటౌట్) అర్థశతకాలతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో మహేశ్ తీక్షణ రెండు వికెట్లు తీయగా జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం వైభవ్ సూర్యవంశీ (101; 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లు) విధ్వంసకర శతకానికి తోడు యశస్వి జైస్వాల్ (70; 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో లక్ష్యాన్ని రాజస్థాన్ 15.5 ఓవర్లలో 2 వికెట్లు నష్టాపోయి అందుకుంది.