Cricket Fan : టీమ్ఇండియా గెలుపు కోసం స్విగ్గీలో 51 కొబ్బరికాయలను ఆర్డర్ ఇచ్చిన వీరాభిమాని.. ఆ తరువాత ఏమైందంటే..?
Cricket Fan Orders 51 Coconuts : మహారాష్ట్రలోని థానే నగరానికి చెందిన ఓ క్రికెట్ వీరాభిమాని ఫైనల్ మ్యాచ్లో టీమ్ఇండియా గెలిస్తే దేవుడికి 51 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాడు.
వన్డే ప్రపంచకప్2023లో టీమ్ఇండియా వరుస విజయాలతో ఫైనల్ చేరుకోవడంతో భారత్ విశ్వవిజేతగా నిలవాలని కోట్లాది మంది అభిమానులు కోరుకున్నారు. కొందరు ఆలయాల్లో పూజలు చేశారు. మరికొందరు వారణాసీలోని గంగానదికి ప్రత్యేక హారతి ఇచ్చారు. అయితే.. మహారాష్ట్రలోని థానే నగరానికి చెందిన ఓ క్రికెట్ వీరాభిమాని ఫైనల్ మ్యాచ్లో టీమ్ఇండియా గెలిస్తే దేవుడికి 51 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాడు.
అంతేనా ఈ కొబ్బరికాయలను అతడు స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చాడు. ఫైనల్ మ్యాచ్కు ముందు దీనిపై స్విగ్గీ స్పందించింది. ‘థానే నుంచి ఎవరో 51 కొబ్బరికాయలు ఆర్డర్ ఇచ్చారు. అది భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కోసమే కావొచ్చు. అదే గనుక అయితే ఈ సారి ఖచ్చితంగా భారత్కు ప్రపంచకప్ రావడం ఖాయం.’ అంటూ ట్వీట్ చేసింది. దీన్ని చూసిన సదరు వ్యక్తి రిప్లై ఇచ్చాడు. ‘ఆ ఆర్డర్ ఇచ్చింది నేనే. టీమ్ఇండియా గెలిస్తే కొబ్బరికాయలను దేవుడికి కొడతాను.’ అంటూ టీవీలో మ్యాచ్ చూస్తున్న ఫోటోను పంచుకున్నాడు. అందులో టేబుల్ పై కొబ్బరికాయలు పేర్చబడి ఉన్నాయి.
వైరల్ అవుతున్న ట్వీట్..
నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మరోసారి సదరు ట్వీట్ వైరల్గా మారింది. భారత జట్టు ఓడిపోవడంతో ఇప్పుడు ఆ 51 కొబ్బరికాయలను సదరు వ్యక్తి ఏం చేశాడని నెటీజన్లు చర్చించుకుంటున్నారు. ఆ కొబ్బరికాయలను అతడు తలపై మాత్రం కొట్టుకోలేదు గదా..? అని ఓ నెటీజన్ కామెంట్ చేయగా, టీమ్ఇండియా మ్యాచ్ ఓడిపోవడంతో అతడికి డబ్బులు వాపస్ చేయాలని స్విగ్గిని మరికొందరు కోరారు. మరీ అతడు ఆ కొబ్బరికాయలను ఏం చేశాడు అనేది అతడు స్పందిస్తే గానీ తెలియదు.
haan bhay yeh someone from thane bhi mai hi hoon, 51 nariyal for unreal manifestation✨ https://t.co/aNa3WACNOp pic.twitter.com/kVuQ6WjCjH
— gordon (@gordonramashray) November 19, 2023
ఇక మ్యాచ్ విషయానికి వస్తూ.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌలైంది. విరాట్ కోహ్లీ (54), కేఎల్ రాహుల్ (66), కెప్టెన్ రోహిత్ శర్మ (47) లు రాణించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టాడు. జోష్ హేజిల్వుడ్, పాట్ కమిన్స్ చెరో రెండు, మాక్స్వెల్, జంపాలు ఒక్కొ వికెట్ తీశారు. అనంతరం ట్రావిస్ హెడ్ (137) శతకం చేయడంతో ఆస్ట్రేలియా 43 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు, మహ్మద్ షమీ, సిరాజ్లు ఒక్కొ వికెట్ తీశారు.