ఆర్సీబీ బౌలర్పై లైవ్లో మురళీ కార్తీక్ వివాదాస్పద కామెంట్స్.. మండిపడుతున్న ఫ్యాన్స్
Yash Dayal: ‘ఒకరి చెత్తే మరొకరి నిధి’ అని అన్నాడు. దీంతో..

Yash- Murali Kartik
ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్ గురించి టీమిండియా మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచులో మురళీ కార్తీక్ కామెంటరీ ఇస్తూ.. ‘ఒకరి చెత్తే మరొకరి నిధి’ అని అన్నాడు.
ఐపీఎల్-2023లో యశ్ దయాల్ గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న సమయంలో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచులో బౌలింగ్ చేసి.. వరుసగా 5 బంతులకు 5 సిక్సులు ఇచ్చుకున్నాడు. యశ్ దయాల్ బౌలింగ్ లో రింకూ సింగ్ వరుసగా 5 సిక్సులు కొట్టడంతో కోల్కతా టీమ్ గెలిచింది. అయినప్పటికీ ఈ సారి వేలంలో యశ్ దయాల్ను ఆర్సీబీ ఏకంగా రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది.
సోమవారం జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ ను కట్టడి చేయడంలో యశ్ దయాల్ కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచులో 4 ఓవర్లు వేసి 23 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. ఇలాంటి సమయంలో మురళీ కార్తీక్ చేసిన కామెంట్ పై విమర్శలు వస్తున్నాయి.
‘ఒకరి చెత్తే మరొకరి నిధి అని ఎలా అంటావు. ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న సమయంలో యశ్ దయాల్ నే మీరు చెత్త అని అన్నారు. అంతేగా..’ అని హాస్యనటుడు, టెలివిజన్ హోస్ట్ డానిశ్ సైత్ నిలదీశారు. ఆర్సీబీ కూడా ట్విట్టర్ లో స్పందిస్తూ యశ్ దయాల్ ఫొటోను పోస్ట్ చేసింది. ‘అతడు ఓ నిధి.. అంతకుమించి చెప్పాల్సిందేమీ లేదు’ అని పేర్కొంది. మురళీ కార్తీక్ కామెంట్లపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
Also Read: మ్యాచ్ గెలిచాక.. తన ఆటతీరు గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన కోహ్లీ