ODI World Cup 2023: టీమిండియాను ఓడించగలరా? ఇంగ్లండ్ పై ఓటమి తరువాత నెదర్లాండ్స్ బ్యాటర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇంగ్లాండ్ జట్టుతో మ్యాచ్ తరువాత నెదర్లాండ్స్ జట్టు బ్యాటర్ తేజ నిడమనూరు మీడియాతో మాట్లాడాడు. టీమిండియాను నెదర్లాండ్స్ జట్టు కలవరపెట్టగలరా అని ప్రశ్నించగా..

Netherlands batter Teja Nidamanuru
Netherlands batter Teja Nidamanuru : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. ఆడిన ఎనిమిది మ్యాచ్ లలోనూ విజయం సాధించింది. ఫలితంగా సెమీస్ కు అర్హత సాధించింది. లీగ్ దశలో చివరి మ్యాచ్ ఈనెల 12న నెదర్లాండ్స్ జట్టుతో టీమిండియా తలపడుతుంది. మరోవైపు నెదర్లాండ్స్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఆ జట్టు కేవలం రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. దక్షిణాఫ్రికాను ఓడించి నెదర్లాండ్స్ జట్టు అందరి దృష్టిని ఆకర్షించింది. బంగ్లాదేశ్ జట్టుపైకూడా విజయం సాధించడం ద్వారా తాము బలమైన జట్టేనని నిరూపించింది. అయితే, బుధవారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ నెదర్లాండ్స్ ఓడిపోయింది. 160 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది.
ఇంగ్లాండ్ జట్టుతో మ్యాచ్ తరువాత నెదర్లాండ్స్ జట్టు బ్యాటర్ తేజ నిడమనూరు మీడియాతో మాట్లాడాడు. టీమిండియాను నెదర్లాండ్స్ జట్టు కలవరపెట్టగలరా అని ప్రశ్నించగా.. అది సాధ్యమేనని నిడమనూరు చెప్పాడు. క్రికెట్ లో అసాధ్యం అనేది ఉండకపోవచ్చు. మేము మా బ్రాండ్ క్రికెట్ ఆడుతాం. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టుతో తలపడాలని మా జట్టు ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారని చెప్పాడు. మేం బంతిని బాగా వేయగలం. మా జట్టులో స్పిన్ బాగా ఆడగల ప్లేయర్స్ కూడా ఉన్నారు. మాకు వికెట్లు తీయగల కుర్రాళ్లు కూడా ఉన్నారు. కానీ, కొంచెం అదృష్టం కావాలి.
టీమిండియా బలమైన జట్టు. వారు చాలా మంచి క్రికెట్ ఆడుతారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ, క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. మేము పెద్దజట్టా.. చిన్న జట్టా అనేది పెద్దగా పట్టించుకోం. ఖచ్చితంగా విజయం సాధించాలని భావిస్తాం. ఈ క్రమంలోనే ఆదివారం భారత్ తో జరిగే మ్యాచ్ లోనూ విజయం సాధించాలని ఎదురు చూస్తున్నాం అని నిడమనూరు అన్నాడు.