ENG vs IND : కోహ్లీ, రోహిత్ ల రిటైర్మెంట్.. అజింక్యా రహానే, పుజారాలకు గోల్డెన్ ఛాన్స్.. బ్యాక్ డోర్ ఎంట్రీ ఖాయం..!
టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వారం వ్యవధిలో టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు.

Rahane Pujara backdoor entry confirmed after Kohli Rohit retirement
టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వారం వ్యవధిలో టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి.. సుదీర్ఘ ఫార్మాట్లో ఈ ఇద్దరు ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసేది ఎవరు అన్న దానిపై పడింది. వచ్చే నెలలో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ జరగనుంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 సైకిల్ ఈ సిరీస్ నుంచే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్లో గెలిచి డబ్ల్యూటీసీ కొత్త సైకిల్ను ఘనంగా ప్రారంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. 14 సంవత్సరాలలో రోహిత్, కోహ్లీలు లేకుండా భారత్ టెస్టు మ్యాచ్ ఆడనుంది. దీంతో టీమ్ఇండియా బ్యాటింగ్ యూనిట్ చుట్టూనే ఇప్పుడు ప్రశ్నలు తిరుగుతున్నాయి.
దీనిపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా స్పందించాడు. ఇంగ్లాండ్ పర్యటనకు అజింక్యా రహానే లేదా ఛతేశ్వర్ పుజారాలలో ఒకరిని ఎంపిక చేయాలని, లేదంటే ఇద్దరికి తీసుకువెళ్లాలని టీమ్ మేనేజ్మెంట్కు సూచించాడు. ప్రస్తుతం ఉన్న యువ ఆటగాళ్లకు టెస్టుల్లో ఎక్కువ అనుభవం లేదని, ఇలాంటి సమయంలో ఈ సీనియర్ ఆటగాళ్లు ఉంటే బాగుంటుందని చెప్పుకొచ్చాడు.
ఇంగ్లాండ్ పర్యటన కాకుండా మరేదైనా అయితే.. అప్పుడు యువ జట్టుతో వెళ్లినా ఏం కాదని, ఇంగ్లాండ్ పర్యటన కాబట్టి ఖచ్చితంగా వీరు ఉంటే బాగుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పుజరా దేశవాళీ సర్క్యూట్తో పాటు ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్ షిప్లోనూ పరుగుల వరద పారించాడు. అటు రహానే సైతం రంజీట్రోఫీ 2024 విజేతగా ముంబైని నిలిపాడు. 12 ఇన్నింగ్స్ల్లో ఓ సెంచరీ, రెండు అర్థశతకాల సాయంతో 437 పరుగులు సాధించాడు.
పుజరా, రహానే ఇద్దరూ కూడా 2023లో చివరి టెస్టు మ్యాచ్ ఆడారు.
ఏ స్థానంలో అవకాశం ఉందంటే..?
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ లు ఓపెనర్లుగా వస్తారు. కోహ్లీ రిటైర్ కావడంతో శుభ్మన్ గిల్ 4వ స్థానంలో రావొచ్చు. అప్పుడు 3వ నంబర్ స్లాట్ రహానే లేదా పుజారాకు ఛాన్స్ ఉంటుంది. ఐదో స్థానంలో రిషబ్ పంత్, ఆరులో నితీష్ కుమార్ రెడ్డి, ఏడో స్థానంలో జడేజా బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉందన్నాడు.
కొన్నాళ్లపాటు జట్టుకు మూలస్తంభాలుగా ఉన్న రహానే, పుజారాలను ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ మ్యాచ్లో ఓటమి తరువాత పక్కన పెట్టారు.
రహానే ఇప్పటి వరకు 85 టెస్టుల్లో టీమ్ఇండియాకు ప్రాతినిథ్యం వహించాడు. 38.5 సగటుతో 5077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పుజారా 103 టెస్టులు ఆడాడు. 43.6 సగటుతో 7195 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.