LSG vs RCB : ఆర్సీబీ పై ఓటమి.. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కీలక వ్యాఖ్యలు.. ఇక క్రికెట్ గురించి ఆలోచించను..
ఐపీఎల్ 2025 సీజన్ను లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్ను లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. మంగళవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఏడో స్థానంతో ఈ సీజన్ను లక్నో ముగించింది. ఇక ఆర్సీబీ పై ఓటమి తరువాత లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. విజయం సాధించాలంటే 40 ఓవర్లు నాణ్యమైన క్రికెట్ ఆడాలని చెప్పాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి లక్నో227 పరుగులు సాధించింది. కెప్టెన్ రిషభ్ పంత్ (118 నాటౌట్; 61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. మిచెల్ మార్ష్ (67; 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో తుషారా, భువనేశ్వర్, షపర్డ్ లు తలా ఓ వికెట్ తీశారు.
ఆతరువాత లక్ష్యాన్ని ఆర్సీబీ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ జితేశ్ శర్మ (85 నాటౌట్; 33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సంచలన బ్యాటింగ్కు తోడు విరాట్ కోహ్లీ (54; 30 బంతుల్లో 10 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (41 నాటౌట్; 23 బంతుల్లో 5 ఫోర్లు) సమయోచితంగా రాణించారు. లక్నో బౌలర్లలో విలియం ఓరూర్కే రెండు వికెట్లు తీయగా, ఆకాష్ మహారాజ్ సింగ్, ఆవేశ్ ఖాన్లు తలా ఓ వికెట్ సాధించారు.
మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ పంత్ మాట్లాడుతూ.. టీ20 మ్యాచ్ల్లో 40 ఓవర్లు మంచి క్రికెట్ ఆడాలని చెప్పాడు. 20 ఓవర్లు ఆడితే సరిపోదన్నాడు. తాము చేసిన పొరపాటు అదేనని చెప్పాడు. ఇక టోర్నమెంట్ ప్రారంభానికి ముందు నుంచి జట్టును గాయాలు వేదిస్తున్నాయని చెప్పుకొచ్చాడు. ఆ ప్రభావం జట్టు పై పడిందన్నాడు.
తన సెంచరీ గురించి పంత్ మాట్లాడుతూ.. ఆరంభాన్ని పెద్ద స్కోరుగా మార్చుకోవాలని మాత్రమే అనుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ‘నేను ప్రతి మ్యాచ్లో బాగానే ఆడాడు. అయితే కొన్ని సార్లు ప్లాన్ వర్కౌట్ అవుతుంది. మరికొన్ని సార్లు కావు. ఈ రోజు నిలదొక్కుకుంటే మాత్రం ఓ పెద్ద స్కోరు చేయాలని అనుకున్నాను. సీనియర్లు అందరూ చేసే విధంగానే తాను ఎల్లప్పుడూ గొప్ప ఆటగాళ్ల నుంచి నేర్చుకుంటూ ఉంటాను.’ అని పంత్ అన్నాడు.
ఇక ఈ సీజన్లో జట్టు ప్రదర్శన పై పంత్ మాట్లాడుతూ.. ఈ సీజన్లో మెరుగుపరచుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని అన్నాడు. ‘ఇప్పుడే సీజన్ ముగిసింది. తరువాత ఏం జరుగుతుందో తెలియదు. ఇక ఈ సీజన్లో కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. దిగ్వేష్ రాఠి గొప్ప ప్రదర్శన చేశాడు. ఇక అవేశ్ ఖాన్ సైతం కీలక ఓవర్లలో చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. కొన్ని మ్యాచ్లు గెలిచేందుకు అవకాశాలు వచ్చినప్పటికి కూడా వాటిని మేము సద్వినియోగం చేసుకోలేకపోము.’ అని పంత్ చెప్పాడు.
ఇక తాను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా పంత్ తెలిపాడు. క్రికెట్ సంబంధించిన ఏ విషయం గురించి ఆలోచించనని అన్నాడు. త్వరలోనే ఇంగ్లాండ్తో సిరీస్ మొదలు కానుందని, ఆ సిరీస్ కోసం ప్రెష్ మైండ్తో ఉండాలని అనుకుంటున్నట్లుగా పంత్ తెలిపాడు.