Sunil Gavaskar : రంజీ ట్రోఫీని ఆపేయండి.. మిలియన్ల ఫాలోవర్లు లేనందుకే పుజారా బలి పశువు.. గవాస్కర్ మండిపాటు
వెస్టిండీస్(West Indies)తో టెస్టు, వన్డే సిరీస్లకు భారత జట్లను బీసీసీఐ(BCCI) ప్రకటించింది. వన్డే జట్టులో పెద్దగా మార్పులు లేనప్పటికీ టెస్టు జట్టులో మాత్రం చాలా మార్పులు చోటు చేసుకున్నాయి
![Sunil Gavaskar : రంజీ ట్రోఫీని ఆపేయండి.. మిలియన్ల ఫాలోవర్లు లేనందుకే పుజారా బలి పశువు.. గవాస్కర్ మండిపాటు Sunil Gavaskar : రంజీ ట్రోఫీని ఆపేయండి.. మిలియన్ల ఫాలోవర్లు లేనందుకే పుజారా బలి పశువు.. గవాస్కర్ మండిపాటు](https://10tv.in/wp-content/uploads/2023/06/Sunil-Gavaskar-fire.jpg)
Sunil Gavaskar fire
Sunil Gavaskar fire : వెస్టిండీస్(West Indies)తో టెస్టు, వన్డే సిరీస్లకు భారత జట్లను బీసీసీఐ(BCCI) ప్రకటించింది. వన్డే జట్టులో పెద్దగా మార్పులు లేనప్పటికీ టెస్టు జట్టులో మాత్రం చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సీనియర్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) పై వేటు వేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రతిష్టాత్మకమైన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో అజింక్య రహానె(Ajinkya Rahane) మినహా మిగిలిన బ్యాటర్లు అంతా దారుణంగా విఫలం అయినప్పటికీ పుజారా ఒక్కడినే ఎందుకు బలి పశువును చేశారంటూ మండిపడుతున్నారు. ఐపీఎల్లో ప్రదర్శన చూసి జట్టును ఎంపిక చేస్తే ఇక రంజీలు ఆడించడం ఎందుకు అని టీమ్ ఇండియా మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఎద్దేవా చేశారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో టీమ్ఇండియా బ్యాటింగ్ యూనిట్ మొత్తం ఫెయిల్ అయ్యిందని, అలాంటప్పుడు పుజారాను ఒక్కడిపైనే వేటు వేయడం సరికాదన్నాడు. పుజరా ఎన్నో ఏళ్లుగా జట్టుకు సేవలు అందిస్తున్నాడని, ఎన్నో గొప్ప విజయాలు అందించాడన్నారు. అతడికి సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లు లేరనే ఉద్దేశ్యంతోనే తప్పించారని అనిపిస్తోందని గవాస్కర్ అన్నారు. మరీ మిగిలిన వాళ్లు కూడా ఫెయిల్ అయ్యారు కదా వారి పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించాడు.
అలాంటప్పుడు రంజీలు ఎందుకు..?
గత రెండు, మూడేళ్లుగా దేశవాలీ క్రిఎట్లో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేయకపోవడాన్ని గవాస్కర్ తప్పుబట్టాడు. గత మూడు సీజన్లుగా సర్ఫరాజ్ 100 సగటుతో పరుగులు చేశాడని, అయినప్పటికీ అతడి భారత జట్టులో చోటుదక్కడం లేదన్నారు. టీమ్ఇండియా స్థానం దక్కించుకోవాలంటే అతడు ఇంతకంటే ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదన్నారు. తుది జట్టులో స్థానం తరువాత.. కనీసం జట్టులోకి అయినా తీసుకుంటే బాగుండేదన్నాడు. అయితే.. సెలక్టర్లు మాత్రం ఐపీఎల్ళో ఆడిన వాళ్లకే జట్టులో చోటు ఇస్తున్నారని అసంతృప్తిని వ్యక్తం చేశారు.
టెస్టులకు కూడా ఐపీఎల్ను ప్రామాణికంగా తీసుకుంటే ఇంక రంజీ ట్రోఫీని నిర్వహించడం ఎందుకు అని ప్రశ్నించాడు. రంజీలను ఆపేయండి. వాటితో ఫలితం లేనప్పుడు అంత ఖర్చు పెట్టడం కూడా దండగేనని అన్నారు. ఐపీఎల్లో రాణిస్తే రెడ్ బాల్ క్రికెట్ ఆడొచ్చునని యువ ఆటగాళ్లకు చెప్పండి అంటూ గవాస్కర్ ఎద్దేశా చేశారు.
టెస్టులకు వాళ్లకు విరామం ఇస్తే బాగుండేది
టెస్టు క్రికెట్ కోసం ఎంపిక చేసిన జట్టులో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి మరింత మంది యువకులకు అవకాశం ఇస్తే బాగుండేందని గవాస్కర్ సూచించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగియడంతో టీమ్ఇండియా ఆడే అతి పెద్ద టోర్నీ వన్డే ప్రపంచకప్ మాత్రమే. దానికి ముందు ఆసియా కప్ ఉంది. కాబట్టి ఈ టోర్నీల్లో ఆడే ఆటగాళ్లకు టెస్టు క్రికెట్ ఆడించకుండా వారి ఫోకప్ మొత్తం వన్డేలపైనే ఉండేలా చూస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. వచ్చే నాలుగైదు నెలల పాటు భారత్ వరుసగా వన్డే మ్యాచులు మాత్రమే ఆడనుందన్నాడు.
Srikar Bharat : వెస్టిండీస్ టూర్కు సిద్ధంగా ఉన్నా.. బాధ్యత మరింత పెరిగింది