WI vs IND : టీమ్ సెలక్షన్ పై మండిపాటు.. నలుగురు ఓపెనర్లు దేని కోసం..? సెలక్టర్లకు అవగాహన లేదు..?
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) మ్యాచ్లో ఆస్ట్రేలియా(Australia) చేతిలో టీమ్ఇండియా(Team India) ఓటమి నేపథ్యంలో సెలక్టర్లు టీమ్ ప్రక్షాళన పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
![WI vs IND : టీమ్ సెలక్షన్ పై మండిపాటు.. నలుగురు ఓపెనర్లు దేని కోసం..? సెలక్టర్లకు అవగాహన లేదు..? WI vs IND : టీమ్ సెలక్షన్ పై మండిపాటు.. నలుగురు ఓపెనర్లు దేని కోసం..? సెలక్టర్లకు అవగాహన లేదు..?](https://10tv.in/wp-content/uploads/2023/06/Wasim-Jaffer-slams-team-selection.jpg)
Wasim Jaffer slams team selection
West Indies vs India : ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) మ్యాచ్లో ఆస్ట్రేలియా(Australia) చేతిలో టీమ్ఇండియా(Team India) ఓటమి నేపథ్యంలో సెలక్టర్లు టీమ్ ప్రక్షాళన పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే వెస్టిండీస్(West Indies)తో టెస్ట్ సిరీస్కు పలువురు సీనియర్ ఆటగాళ్లపై వేటు వేశారు. అదే సమయంలో కుర్రాళ్లకు అవకాశం కల్పించారు. అయితే.. రంజీల్లో రాణించిన ఆటగాళ్లను కాదని ఐపీఎల్(IPL)లో సత్తా చాటిన వారిని ఎంపిక చేయడాన్ని పలువురు మాజీ ఆటగాళ్లు తప్పుబడుతున్నారు.
రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం నలుగురు ఓపెనర్లను ఎంపిక చేయాల్సిన అవసరం ఏముందని టీమ్ఇండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ప్రశ్నించాడు. వారిలో ఒకరిని తగ్గించి రంజీల్లో రాణించిన సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేస్తే మిడిల్ ఆర్డర్ పటిష్టం అయ్యేదని సూచించాడు. టెస్టు కూర్పు పట్ల సెలక్టర్లకు అవగాహన లేనట్లు కనిపిస్తోందన్నాడు.
ఇక రంజీల్లో రాణించిన అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పాంచాల్ వంటి ఆటగాళ్లు ఇండియా-ఏ తరుపున కూడా అద్భుతంగా ఆడుతూ టీమ్ఇండియాలో స్థానం కోసం ఎదురుచూస్తున్నారన్నాడు. వీరు ఐపీఎల్ ఆడలేదన్న ఒకే ఒక్క కారణంతో భారత జట్టుకు ఎంపిక చేయరా అని ప్రశ్నించాడు. రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్లో రాణించడంతోనే టెస్టు జట్టులోకి వచ్చాడని, దీన్ని బట్టే సెలక్టర్ల ఎలా ఆలోచిస్తున్నారనే విషయం అర్ధమవుతోందన్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ తరువాత వెస్టిండీస్ పర్యటనకు నెలరోజులకు పైగా ఆటగాళ్లకు విశ్రాంతి లభించింది. అయినప్పటికీ మళ్లీ మహ్మద్ షమీకి విశ్రాంతి ఇవ్వడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించింది అని జాఫర్ అన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో జాఫర్ ట్వీట్ చేశాడు.
Thoughts? #WIvIND pic.twitter.com/2YwaMuOwvN
— Wasim Jaffer (@WasimJaffer14) June 24, 2023
విండీస్తో టెస్టు సిరీస్కు యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్ వంటి యువ ఆటగాళ్లకు చోటు దక్కగా, సీనియర్ ఆటగాడు అజింక్య రహానె తిరిగి వైస్ కెప్టెన్గా ఎంపిక అయ్యాడు. పేలవ ఫామ్తో బాధపడుతున్న ఛతేశ్వర్ పుజారా, ఉమేశ్ యాదవ్ లపై వేటు పడింది.
Abhinav Mukund : టీమ్ఇండియాలో చోటు దక్కాలంటే అదొక్కటే మార్గం.. అభినవ్ ముకుంద్ ట్వీట్ వైరల్
విండీస్తో సిరీస్కు భారత టెస్టు జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, అజింక్య రహానె (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జయ్దేవ్ ఉనద్కత్, నవ్దీప్సైని