Anand Mahindra : ఆపిల్ విజన్ ప్రో.. మనుషులకు దూరంగా.. వర్చువల్కు దగ్గరగా.. ఇదే మన భవిష్యత్తు అంటే.. అది పీడకలే : ఆనంద్ మహీంద్రా ఆందోళన
Anand Mahindra : ఆపిల్ కొత్త వీఆర్ హెడ్సెట్ విజన్ ప్రోని ధరించిన వ్యక్తి స్కూటర్ లాంటి వెహికల్ నడుపుతున్నట్లుగా ఉన్న వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఇదే మన భవిష్యత్తు అంటే.. పీడకలే అవుతుందన్నారు.
![Anand Mahindra : ఆపిల్ విజన్ ప్రో.. మనుషులకు దూరంగా.. వర్చువల్కు దగ్గరగా.. ఇదే మన భవిష్యత్తు అంటే.. అది పీడకలే : ఆనంద్ మహీంద్రా ఆందోళన Anand Mahindra : ఆపిల్ విజన్ ప్రో.. మనుషులకు దూరంగా.. వర్చువల్కు దగ్గరగా.. ఇదే మన భవిష్యత్తు అంటే.. అది పీడకలే : ఆనంద్ మహీంద్రా ఆందోళన](https://10tv.in/wp-content/uploads/2024/03/Nightmare_-Anand-Mahindras-take-on-video-of-man-wearing-Apple-Vision-Pro.jpg)
Nightmare: Anand Mahindra's take on video of man wearing Apple Vision Pro
Anand Mahindra : మనుషులతో మాట్లాడే రోజులు పోయాయి.. అందరూ ఫోన్లు, ఇతర స్మార్ట్ డివైజ్లతోనే ముచ్చటించే రోజులివి. ప్రస్తుత ఆధునిక టెక్నాలజీతో లేనిది ఉన్నట్టుగా చూపిస్తూ.. అదే వాస్తవమని భ్రమించేలా చేస్తోంది. మనిషి జీవితంలోకి స్మార్ట్ డివైజ్లు వచ్చేసి అవే ప్రపంచంగా మార్చేశాయి. క్షణం కూడా తీరిక లేకుండా వాటితోనే కాలక్షేపం చేసే స్థితికి చేరుకున్నాం. అవసరానికి మించి టెక్నాలజీని వినియోగిస్తూ అనేక అనర్థాలకు దారితీస్తుందని మర్చిపోతున్నారు. ఇదే విషయంలో టెక్ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.
Read Also : Apple Vision Pro Sale : ఆపిల్ విజన్ ప్రో సేల్.. ఈ హెడ్సెట్ రిపేరింగ్ ఖర్చు రూ.2 లక్షల పైమాటే..!
మనుషుల మధ్య మాటలు కరువయ్యాయి. స్మార్ట్ డివైజ్లతో ఆటలెక్కువయ్యాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందడం సరే.. దాని వినియోగం ఇంతలా ఉంటే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని గురించి తలచుకుంటేనే భయానకంగా అనిపిస్తోందని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. మితిమీరిన సాంకేతిక వినియోగంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజగా ఆయన ట్విట్టర్ (X) వేదికగా ఒక వీడియోను ట్వీట్ చేశారు.
Completely plugged in…
And yet,
Completely disconnected.
If this is the future, then it’s a nightmare….
— anand mahindra (@anandmahindra) March 11, 2024
వర్చువల్ ప్రపంచంలో లీనమై.. బయటి ప్రపంచానికి దూరమై :
ఆ వీడియోలో ఒక వ్యక్తి షాపింగ్ మాల్లో సింగిల్ వీల్ ఏఐ స్కూటర్పై చక్కర్లు కొడుతున్నాడు. ఒక చేతిలో పాప్ కార్న్, మరో చేతిలో కూల్ డ్రింక్ పట్టుకుని.. కళ్లకు ఆపిల్ విజన్ ప్రో ధరించాడు. అసలు బయటి ప్రపంచంతోనే సంబంధం లేకుండా వర్చువల్ ప్రపంచంలో మునిగిపోయాడు. పైగా ఆ ఏఐ స్కూటర్ హ్యాండిల్కు కొన్ని స్మార్ట్ఫోన్లు కూడా కనెక్ట్ చేసి ఉంచారు. కొంచెం కూడా నడిచే అవసరం లేకుండా.. మనుషులతో మాట్లాడే పనిలేకుండా కేవలం వర్చువల్ ప్రపంచంలోనే లీనమయ్యే సాంకేతికత చిక్కుల గురించి మహీంద్రా ఆందోళనలను వ్యక్తం చేశారు.
గతంలోనూ ఇదే ఆపిల్ విజన్ ప్రో గురించి ఆనంద్ మహీంద్రా భయానకమైనదిగా పేర్కొన్నారు. మనుషులతో పనిలేదు.. ప్రపంచమంతా జాంబీలతో నిండిపోతుందని గతంలో ట్వీట్ చేశారు. తాజాగా ఇదే వర్చువల్ టెక్నాలజీకి సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘టెక్నాలజీతో పూర్తిగా కనెక్ట్ అయ్యాడు సరే.. కానీ, వాస్తవ ప్రపంచంతో డిస్ కనెక్ట్ అయినట్టుగా అనిపిస్తుంది.. ఒకవేళ మన భవిష్యత్తు ఇదే అయితే మాత్రం.. అది కచ్చితంగా పీడకలే అవుతుంది’ అని మహీంద్రా ట్వీట్ చేశారు.
మనుషులతో కాదు.. అన్ని మిషన్లతోనే :
ఈ వీడియో సాంకేతిక పురోగతి, మానవ సంబంధాల మధ్య సమతుల్యత గురించి చర్చలకు దారితీసింది. వర్చువల్ రియాలిటీ వినోదం అందించినప్పటికీ, రోజువారీ కార్యకలాపాల కోసం సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడటం వల్ల కలిగే పరిణామాల గురించి కూడా అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. మహీంద్రా ట్వీట్పై స్పందించిన నెటిజన్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
చాలామంది నెటిజన్లు.. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చెందాక అనేక మంది చిన్నారులు బాల్యంలో పొందాల్సినవి అన్ని కోల్పోతున్నారని, భవిష్యత్తులో ఇక మనుషులతో మాట్లాడే పరిస్థితి ఉండదు.. అంతా మెషిన్లతో కనెక్ట్ అవుతారు. తలుచుకుంటేనే భవిష్యత్తు ఎంత భయానకంగా అనిపిస్తుంది’ అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.