Kishan Reddy : వైసీపీ, బీఆర్ఎస్ కుట్ర చేశాయి- కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు

ఎన్నికల సమయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు డ్రామా ఆడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేలా లేఖ రాయాలని అనుకుంటున్నా.

Kishan Reddy : వైసీపీ, బీఆర్ఎస్ కుట్ర చేశాయి- కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు

Kishan Reddy Fires On YSRCP, BRS (Photo : Facebook)

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. రెండు పార్టీలు పోటాపోటీగా వేల కోట్ల రూపాయల డబ్బు పంచాయన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజలకు బీజేపీ తరపున అభినందనలు తెలిపారాయన. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు విశేషంగా కృషి చేశారని చెప్పారు.

ఇక.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. ఆ రెండు పార్టీలు భారీగా డబ్బు, మద్యం పంచాయని ఆరోపించారు. ఎన్నికల సంఘం నిబంధనలను ఆ రెండు పార్టీలు తుంగలో తొక్కాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ డబ్బులు కర్నాటక నుంచి వచ్చాయని, బీఆర్ఎస్ దోచుకున్న ప్రజాధనాన్ని పోలీసుల కళ్లెదుటే పంచిందని ఆరోపణలు చేశారు. ఆ రెండు పార్టీలపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి.

Also Read : తెలంగాణలో గెలిచేది ఈ పార్టీనే..! ఎగ్జిట్ పోల్స్ సంచలన ఫలితాలు

”ఈరోజు జరిగిన ఎన్నికల్లో మంచి ఫలితాలు ఆశిస్తున్నాం. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించ లేదు. అధికార బీఆర్ఎస్ కి అనుకూలంగా పని చేశారు. పోలీసుల ముందే విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ జరిగింది. అయినా చూసీ చూడనట్లే వ్యవహరించారు. అనేక నియోజకవర్గాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. అయినా ధైర్యంగా ఎదుర్కొని, ఎన్నికల్లో ముందుకు వెళ్లారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు, దొంగ ఓట్లతో కాంగ్రెస్, బీఆర్ఎస్ అరాచకాలు సృష్టించాయి. దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ సెంటిమెంట్ ను రెచ్చగొట్టింది. అడ్డంకులు ఎదురైనా బీజేపీ శ్రేణులు నిలవరించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా.

సాగర్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఈరోజు జరిగిన ఘటనను ఖండిస్తున్నా. ఇది ఏమాత్రం మంచిది కాదు. దుందుడుకు విధానంతో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదు. ఏకపక్షంగా ప్రాజెక్టు గేట్లు ఎత్తి సాగర్ నీళ్లు తరలించడం సరైన పద్దతి కాదు. ఇది వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్రతో కావాలనే చేశాయి. శాంతిభద్రత సమస్య రాకుండా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేలా లేఖ రాయాలని అనుకుంటున్నా. ఎన్నికల సమయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు డ్రామా ఆడుతున్నాయి” అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

Also Read : ఎగ్జిట్ పోల్స్‌లో నిజమెంత? ప్రజాతీర్పును నిర్ధారిస్తాయా? 2018లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే