ధరణి.. దేశంలోనే ట్రెండ్ సెట్టర్ – సీఎం కేసీఆర్

  • Published By: madhu ,Published On : October 29, 2020 / 01:25 PM IST
ధరణి.. దేశంలోనే ట్రెండ్ సెట్టర్ – సీఎం కేసీఆర్

Updated On : October 29, 2020 / 1:33 PM IST

CM KCR To Address On Dharani Portal : ధరణి పోర్టల్ భారతదేశానికే ట్రెండ్ సెట్టర్ అన్నారు సీఎం కేసీఆర్. భూముల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగాకుండా ఉండాలని, భూములకు సంపూర్ణ రక్షణ ఉండాలని తాను 5 ఏళ్ల క్రితమే నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. 2020, అక్టోబర్ 29వ తేదీ గురువారం మూడు చింతలపల్లిలో ధరణి పోర్టల్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.



20 -30 దేశాల్లో తన ఉపన్యాసాన్ని వింటున్నారని తెలిపారు. వేల సంవత్సరాల క్రితం వ్యవసాయం చేసే విషయం మానవజాతికి తెలియనప్పుడు భూమికి ప్రాధాన్యత ఉండకపోయేదన్నారు. క్రమపద్ధతిలో వ్యవసాయం చేసే పద్ధతులు నేర్చుకున్న క్రమంలో..భూమికి విలువ పెరిగిందన్నారు. రెవెన్యూ చట్టాలకు, భూ వివాదాలకు చెక్ పెట్టాలని భావించి కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.



అందులో కొన్ని ఫలితాలు ఇవ్వగా..కొన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు. వీటన్నింటికీ శాశ్వత నివారణగా..తెలంగాణ రైతు లోకం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు..గత ఐదు సంవత్సరాల క్రితమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.



తప్పులు చేసే అధికారం తనకు లేదని, ఒక తప్పు చేస్తే..భవిష్యత్ తరాలు ఇబ్బందులు పడుతాయన్నారు. తప్పటడుగులు లేకుండా..సరైన పంథాలో ముందుకు వెళ్లేందుకు..కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో మిషన్ భగీరథ కార్యక్రమం పెడుతున్నట్లు, దీని ద్వారా మంచినీళ్లు వస్తాయని, నీళ్లు తీసుకరాకపోతే..వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు.



ఎలా సాధ్యమౌతుందని పలువురు ప్రశ్నించారని, కానీ విజయవంతంగా పథకం అమలవుతుందని తెలిపారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తయితే..ఇక్కడి నుంచే నీళ్లు తీసుకోవడం జరుగుతుందని, కరెంటు కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డామో అందరికీ తెలిసిందేన్నారు. కరెంటు విషయంలో తెలంగాణ టాప్ లో ఉందన్నారు. 26 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి..వందలాది సబ్ స్టేషన్ లు నిర్మించి..24 గంటల పాటు కరెంటు సరఫరా చేస్తున్నామన్నారు. సంక్షేమం, ఇతరత్రా విషయాల్లో దేశానికి తెలంగాణ మార్గదర్శకంగా ఉందన్నారు సీఎం కేసీఆర్.