నీతి ఆయోగ్ సమావేశం బహిష్కరణ- సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

తెలంగాణ ఒక రూపాయి పన్ను చెల్లిస్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చేది 43 పైసలే.. బీహార్ కు రూ.7.26 పైసలు. తెలంగాణ నుంచి 3లక్షల కోట్లకుపైగా పన్నుల రూపంలో ఇస్తే.. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేది 1 లక్షా 68వేల కోట్లు మాత్రమే.

నీతి ఆయోగ్ సమావేశం బహిష్కరణ- సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

Cm Revanth Reddy : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న రేవంత్ సర్కార్.. కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. తెలంగాణ హక్కులకు కేంద్రం భంగం కలిగించిందని ఆయన మండిపడ్డారు. నిధుల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం చేసిందని వాపోయారు.

తెలంగాణపై కేంద్రానిది వివక్ష మాత్రమే కాదు కక్షపూరిత వైఖరి- సీఎం రేవంత్ రెడ్డి
” ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ దేశ అభివృద్ధికి బాటలు వేశారు. వారి స్ఫూర్తితో ఇందిరా గాంధీ ఎన్నో సరళీకృత విధానాలను తీసుకొచ్చారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత సోనియాగాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేశారు. తెలంగాణ అభివృద్ధికి కావాల్సినవన్నీ విభజన చట్టంలో పొందుపరిచి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.

విభజన హామీలు అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. రాష్ట్రంలో మేం అధికారంలోకి రాగానే కేంద్ర పెద్దలను కలిసి మా విజ్ఞప్తులు ఇచ్చాము. ఎవరి దయా దాక్షిణ్యాలతో నాకు ముఖ్యమంత్రి పదవి రాలేదు. ఎవరినో పెద్దన్న అంటే నాకు ఈ పదవి రాలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు సార్లు ప్రధానిని కలిశా. 18సార్లు కేంద్ర మంత్రులను కలిశాం. తెలంగాణకు నిధులివ్వాలని విజ్ఞప్తి చేశాం. ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే కలిశాం తప్ప.. ఎవరి దగ్గరో వంగిపోవడానికో, లొంగిపోవడానికో కాదు. తెలంగాణపై కేంద్రానిది వివక్ష మాత్రమే కాదు.. కక్షపూరిత వైఖరి.. కొంతమంది త్యాగాలు చేశామని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే కాకుండానే కొందరికి మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ అని వాళ్లు గుర్తుంచుకోవాలి.

తెలంగాణ ఒక రూపాయి పన్ను చెల్లిస్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చేది 43 పైసలే.. బీహార్ కు రూ.7.26 పైసలు. తెలంగాణ నుంచి 3లక్షల కోట్లకుపైగా పన్నుల రూపంలో ఇస్తే.. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేది 1 లక్షా 68వేల కోట్లు మాత్రమే. మన హక్కులు మనకు ఇవ్వకపోవడం వల్లే ఈ అంశంపై సభలో చర్చించాల్సిన పరిస్థితి. ఐదు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్నది ఎంత? దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్నది రూ.22 లక్షల 26 వేల కోట్లు. కేంద్రం 5 రాష్ట్రాలకు తిరిగి ఇచ్చేది రూ.6 లక్షల 42వేల కోట్లు మాత్రమే. పన్నుల రూపంలో కేంద్రానికి ఉత్తరప్రదేశ్ ఇచ్చేది రూ.3 లక్షల 41 వేల కోట్లు మాత్రమే. కానీ యూపీకి కేంద్రం తిరిగి ఇచ్చేది రూ.6 లక్షల 91వేల కోట్లు. ఐదు రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే యూపీకి చెల్లించేది ఎక్కువ.. ఇదీ కేంద్రం వివక్ష.

దేశం 5 ట్రిలియన్ ఎకానమీ సాధించాలంటే హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ప్రధానికి స్పష్టంగా చెప్పాం. మూసీ అభివృద్ధికి, మెట్రో విస్తరణకు, ఫార్మా అభివృద్ధికి నిధులివ్వాలని కోరాం. ఐఐఎం, సైనిక్ స్కూల్ ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. సభలో పార్టీలు, వ్యక్తుల ప్రయోజనాల కోసమే కొంతమంది మాట్లాడటం శోచనీయం. అందరం ఏకతాటిపై ఉంటే కేంద్రం మెడలు వంచి నిధులు సాధించుకోవటం పెద్ద కష్టం కాదు. రాష్ట్రాలకు న్యాయంగా దకాల్సిన వాటా దక్కడం లేదు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేశాం. తెలంగాణ హక్కులకు భంగం కలిగించినందుకు, నిధుల కేటాయింపులో జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Also Read : కేసీఆర్‌ను రమ్మనండి..! ఢిల్లీలో దీక్షకు సిద్ధమన్న సీఎం రేవంత్ రెడ్డి