Cm Revanth Reddy : నాదీ బాధ్యత- గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులకు సీఎం రేవంత్ కీలక హామీ

ఎన్నికల కోడ్ ముగిశాక ప్రభుత్వం తరపున మిమ్మల్ని ఆహ్వానిస్తాం. పాలసీ డాక్యుమెంట్ పై మీ అభిప్రాయాలను, సూచనలను తీసుకుని ముందుకెళతాం.

Cm Revanth Reddy : నాదీ బాధ్యత- గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులకు సీఎం రేవంత్ కీలక హామీ

Cm Revanth Reddy

CM Revanth Reddy : గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గల్ఫ్, ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల కోసం ప్రత్యేక బోర్డ్ ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు. ప్రజా భవన్ లో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువ మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారని సీఎం రేవంత్ చెప్పారు. ఏజెంట్ల బారిన పడి కొందరు, యాజమాన్యం చేతిలో మరికొందరు కార్మికులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు.

”సెప్టెంబర్ 17 లోగా మీ సమస్యల పరిష్కారానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత మాది. ఫిలిప్పీన్స్ విధానాలను మేం స్పష్టంగా అధ్యయనం చేశాం. కార్మికుల హక్కులు కాపాడేందుకు ఆ దేశమే ఇతర దేశాల వ్యవస్థలతో మాట్లాడుతుంది. కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా అధ్యయనం చేశాం. ఇప్పటికే గల్ఫ్ కార్మికుల కోసం ఒక పాలసీ డాక్యుమెంట్ తయారు చేశాం. ఎన్నికల కోడ్ ముగిశాక ప్రభుత్వం తరపున మిమ్మల్ని ఆహ్వానిస్తాం. పాలసీ డాక్యుమెంట్ పై మీ అభిప్రాయాలను, సూచనలను తీసుకుని ముందుకెళతాం. గల్ఫ్ కార్మికులకు న్యాయపరమైన సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటాం. ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా చర్యలు తీసుకోబోతున్నాం.

ఏజెంట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటాం. గల్ఫ్ వెళ్లే వారికి ఒక వారం రోజులు శిక్షణ అందించేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తున్నాం. రైతు బీమా లాగే గల్ఫ్ కార్మికులకు బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మీ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు జీవన్ అన్నకు అవకాశం ఇవ్వండి. పార్లమెంటులో మీ గొంతు వినిపించేందుకు నిజామాబాద్ పార్లమెంటులో కాంగ్రెస్ ను గెలిపించండి” అని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

Also Read : రబ్బరు చెప్పులతో వచ్చిన హరీశ్ రావుకి వేల కోట్లు ఎలా వచ్చాయ్? మంత్రి దామోదర రాజనర్సింహ