Crime News Today : కుటుంబంలో చిచ్చు పెట్టిన సీరియల్.. భార్యాభర్తల మధ్య ఘర్షణ.. ఆత్మహత్యాయత్నం
భర్తతో ఘర్షణ అనంతరం కవిత గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఆమె కుమారుడు సైతం పురుగుమందు తాగడంతో..

husband and wife
Crime News Today :సీరియల్ చూస్తూ తనను పట్టించుకోవడం లేదని ఆగ్రహానికి గురైన భర్త తన భార్యతో ఘర్షణకు దిగాడు. ఘర్షణ కాస్త తీవ్రం కావడంతో భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఇది గమనించిన కుమారుడు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో చోటు చేసుకుంది.
Also Read: Mobile Usage: మొబైల్ ఎక్కువగా వాడుతున్నారా.. ఈ చిన్న చిట్కా పాటించండి.. మొబైల్ మొహం కూడా చూడరు
కోడిపుంజుల తండాకు చెందిన ధరావత్ రాజుకు మహబూబాబాద్ మండలం సాలార్ తండాకు చెందిన కవితతో పది సంవత్సరాల క్రితం రెండో వివాహం జరిగింది. అప్పటికే కవితకు వివాహం జరగగా మున్న (11) అనే కుమారుడు ఉన్నాడు. కొడుకుతో సహా ఆమె రాజుతో కోడిపుంజుల తండాలో నివాసం ఉంటుంది. వీరికి భవ్యశ్రీ అనే కుమార్తె ఉంది.
రాజు గురువారం రాత్రి ఇంటికొచ్చాడు. ఆ సమయంలో భార్య కవిత టీవీలో సీరియల్ చూస్తుంది. రాజు అన్నం పెట్టమని అడగ్గా.. సీరియల్ చూస్తున్న కవిత.. కొంత సమయం ఆగమని చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన రాజు భార్యపై వాదనకు దిగాడు. వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి వివాదం తీవ్రరూపం దాల్చింది. ఇంటి చుట్టుపక్కన వాళ్లు వచ్చి వారికి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
బాలుడు మున్న పరిస్థితి విషమం
ఇదే విషయమై శుక్రవారం ఉదయం మరోసారి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కవిత ఆత్మహత్య చేసుకుంటానని తమ వ్యవసాయబావి వద్దకు వెళ్లింది. స్థానికులు గమనించి అక్కడి నుంచి ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.
రాజు వ్యవసాయబావి వద్దకు వెళ్లగా ఇంట్లో ఉన్న కవిత గడ్డి మందు తాగింది. ఇది చూసిన ఆమె కుమారుడు మున్న కూడా గడ్డిమందు తాగాడు. స్థానికులు ఈ విషయం గమనించి ఇద్దరినీ మహబూబాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాగా, బాలుడు మున్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు.