Telangana Elections: తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రేటర్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా? కారణం అదేనా?
తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలను నాలుగైదు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఇంకా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటికి కూడా జూన్లో ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం కసరత్తు చేసింది.
- తెలంగాణలో గ్రేటర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఆలస్యం కానున్నాయా.?
- S.I.R ప్రక్రియనే ఎలక్షన్స్కు అడ్డుగా మారిందా?
- డిసెంబర్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలు.!?
Telangana Elections: పల్లె పోరు ముగిసింది. మున్సిపల్ ఎన్నికలు కూడా అయిపోయాయి. ఆ తర్వాత ముందుగా గ్రేటర్ ఎన్నికలు పెట్టి..ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలనుకుంది తెలంగాణ ప్రభుత్వం. కానీ అనుకోని అడ్డంకులు వచ్చి పడ్డాయని చెప్తున్నారు అధికారులు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా..? తెలంగాణలో S.I.R నడుస్తుండటంతో ఎన్నికలకు బ్రేక్ పడనుందా.? జూన్లో ఎన్నికలు జరిపేందుకు స్టేట్ ఈసీ కసరత్తు చేపట్టినా..సర్ నేపథ్యంలో వాయిదా వేయాలని డిసైడ్ అయ్యారట. ఇంతకు ఎంపీటీసీ, జడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగేదెప్పుడు.?
తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలను నాలుగైదు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఇంకా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటికి కూడా జూన్లో ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం కసరత్తు చేసింది. అలాగే పాలకవర్గం గడువు ముగిసిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా నిర్వహించాలని భావించింది.
అయితే కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్..సర్ కారణంగా ఎన్నికలు వాయిదా పడినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం చేపట్టిన సర్ ప్రక్రియ..తెలంగాణలో జూన్ 25 నుంచి స్టార్ట్ అయింది. ఓటరు జాబితాపై ప్రత్యేక డ్రైవ్ నడవనుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయి..కొత్త ఓటరు జాబితాను అక్టోబర్లో విడుదల చేయనున్నారు. అక్టోబర్లో కొత్త ఓటరు జాబితా వచ్చే వరకు తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు నిర్వహించడానికి వీళ్లేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
అక్టోబర్లో ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చాక ఎన్నికలు?
ప్రస్తుతం తెలంగాణలో సర్ కోసం పెద్దఎత్తున అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం వినియోగిస్తోంది. సర్ కోసం కేంద్రం కఠినమైన నిబంధనలు తీసుకురావడంతో..ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి బాగా టైమ్ పట్టనుందట. ఇళ్లను మ్యాపింగ్ చేయడం..ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాల సేకరణను చేపట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.39 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి తుది ఓటర్ల జాబితాను అక్టోబర్లో ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. అక్టోబర్లో ఫైనల్ ఓటరు లిస్ట్ వచ్చాక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్లోని GHMC, MMC, CMC ఎన్నికలతో పాటు రాష్ట్రంలో మిగిలిన మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు పెట్టనున్నారు.
అయితే సర్ పూర్తయ్యేలోపు రిజర్వేషన్లు, వార్డుల విభజనలోని సమస్యలను కొలిక్కి తేచ్చేలా వంటి వాటిపై ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టిందట. ఓటరు జాబితా వచ్చిన తర్వాతే రిజర్వేషన్లు కానీ..వార్డుల ఏర్పాటు అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉందట. అందుకే ఓటరు జాబితా వచ్చాక..నవంబర్ లేదా డిసెంబర్లో ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ చేయనున్నారట. సర్ ప్రక్రియలో మరింత ఆలస్యం అయితే..ముఖ్యంగా ఓటరు జాబితాపై రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే..గ్రేటర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇంకా లేటు కానున్నాయి.
అంతా అనుకున్నట్లు జరిగితే డిసెంబర్లో ఎన్నికలు?
సర్పంచ్ ఎన్నికలు అయిపోయినప్పటి నుంచే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఎప్పుడన్న చర్చ నడుస్తోంది. మరోవైపు రాబోయే జనరల్ ఎలక్షన్స్కు సెమీ ఫైనల్గా భావిస్తున్న పార్టీలు గ్రేటర్లోని మూడు కార్పొరేషన్ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే జూన్లో ఎన్నికలు పెడుతారని ఆ మధ్య లీకులు రావడంతో రాజకీయం వేడెక్కింది. కానీ సర్ ప్రక్రియపై ఈసీ ప్రకటన చేయడంతో..తెలంగాణలో గ్రేటర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు బ్రేకులు పడ్డట్లు అయింది. అంతా సవ్యంగా జరిగితే అక్టోబర్ నాటికి ఓటరు జాబితా వస్తే..డిసెంబర్లో ఇటు గ్రేటర్తో పాటు అటు పరిషత్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. లేదంటే ఎన్నికలకు మరింత ఆలస్యం అవడం పక్కా అంటున్నాయి అధికారిక వర్గాలు. డిసెంబర్లో అయినా ఎన్నికలు జరుగుతాయో లేదో చూడాలి మరి.
Also Read: ఖమ్మంలో భట్టి Vs రేణుక.. లొల్లి ఎక్కడ స్టార్ట్ అయింది? పీసీసీకి ఫిర్యాదు చేసేవరకు ఎందుకెళ్లింది?
