Gossip Garage : ఎమ్మెల్సీ రేసు.. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ లాబీయింగ్ చేస్తున్న ఆ రెడ్డి లీడర్లు ఎవరు?
నాలుగు సీట్లు దక్కబోతుంటే..రెడ్డి కోటాలో ఓ నేతకు అవకాశం దక్కే చాన్సుంటే.. అరడజను మంది పోటీ పడటం మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది.

Gossip Garage : పార్టీ కోసం కష్టపడ్డాం. నచ్చ చెప్తే విని సీటు త్యాగం చేశాం. పవర్లోకి వచ్చాక కూడా ఏడాది వెయిట్ చేశాం. ఇప్పుడు అవకాశం ఉంది. నన్ను మండలికి పంపండి అంటూ.. హస్తం లీడర్లు ఓ రేంజ్లో లాబీయింగ్ చేస్తున్నారట. పార్టీకి దక్కబోయే నాలుగు స్థానాల్లో నాకొకటి ఇవ్వండి అంటూ..అరడజను మంది రెడ్డి లీడర్లు రేసులో ఉన్నారు. ఒక్క చాన్స్ ప్లీజ్ అని లాబీయింగ్ చేస్తున్న ఆ రెడ్డి లీడర్లు ఎవరు.? పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.? సీనియారిటీకా..త్యాగానికా..పట్టం దక్కబోయేదెవరికి.?
వచ్చే ఏడాదిలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ..
పార్టీ కోసం కష్టపడ్డాం. సీటు కూడా త్యాగం చేశాం. గత పదేళ్లు పోరాడినా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో గుర్తింపు దక్కడం లేదు. అధికార పార్టీలో ఉండి కూడా అపోజిషన్లో ఉన్నట్లే ఉందని తెగ బాధపడిపోతున్నారు కొందరు హస్తం నేతలు. త్వరలో ఖాళీ కాబోయే ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. వచ్చే ఏడాదిలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. సంఖ్యా పరంగా అధికార పార్టీ కాంగ్రెస్కు నాలుగు స్థానాలు దక్కనున్నాయి. కాంగ్రెస్కు దక్కే నాలుగు సీట్లను సామాజిక సమీకరణాల ప్రకారం ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తోందట. రెండు బీసీలకు…ఒకటి ఎస్సీకి..మరొకటి రెడ్డి సామాజికవర్గం నేతకు ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రెడ్డి సామాజికవర్గం నుంచి ఒకరికి ఎమ్మెల్సీగా చాన్స్ దక్కే అవకాశం ఉండటంతో ఎవరా లక్కీ పర్సన్ అనేది పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒక్క బెర్త్ కోసం అరడజను మంది రెడ్డి నేతలు పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నారట. సీనియర్ నేత జీవన్ రెడ్డి గట్టిగా ఎమ్మెల్సీ కోసం పట్టుబడుతున్నారట. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి పదవీ కాలం మార్చితో ముగుస్తుంది. ఈసారి గ్రాడ్యుయేట్ స్ధానం నుంచి పోటీ చేయబోనని ఇప్పటికే స్పష్టం చేసిన ఆయన..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్లోకి తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు జీవన్రెడ్డి. తన అసంతృప్తిని పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తనకు గౌరవం ఇవ్వాలనుకుంటే ఎమ్మెల్సీని చేయాలని కోరుతున్నారట జీవన్రెడ్డి.
ఇక మరో సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. పైకి బయట పడకపోయినా..పార్టీ ముందు తన ప్రతిపాదనను ఉంచారట. రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండే జగ్గారెడ్డి వైపు రేవంత్ కూడా అంతో ఇంతో పాజిటివ్గానే ఉన్నారనే టాక్ వినిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కూడా తన పేరును పరిశీలించాలని కోరుతున్నారట. మరోవైపు గత ఎన్నికల్లో వనపర్తి టికెట్ ఆశించినా దక్కకపోవడంతో ఈ సారి ఎమ్మెల్సీ వస్తుందనే ధీమాతో ఉన్నారు యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. యువనేతగా శివసేనారెడ్డి పట్ల సీఎం రేవంత్ తో పాటు..పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది.
ఇక ఎమ్మెల్సీ ఛాన్స్ కోసం మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన పారిజాత నర్సింహారెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళా కోటాతో పాటు..చివరి నిమిషంలో ఎమ్మెల్యే టికెట్ మిస్ కావడంతో..ఎమ్మెల్సీగానైనా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన నాయకురాలు..పైగా ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ కావడంతో అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అదే నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత దేప భాస్కర్ రెడ్డి కూడా..పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ దక్కని మరో నేత మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి అడుగుతున్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కనప్పుడు..తర్వాత వచ్చే అవకాశాల్లో మొదటి ప్రాధాన్యం ఉంటుందని ఇచ్చిన హామీని ప్రస్తావిస్తున్నారట.
నాలుగు సీట్లు దక్కబోతుంటే..రెడ్డి కోటాలో ఓ నేతకు అవకాశం దక్కే చాన్సుంటే.. అరడజను మంది పోటీ పడటం మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది. అందులో ముగ్గురు సీనియర్ లీడర్లు..మరో ముగ్గురు పార్టీ కోసం టికెట్ త్యాగం చేసిన లీడర్లు కావడంతో వారిలో ఎవరికి ఛాన్స్ దక్కనుందన్నది చర్చనీయాంశం అవుతోంది.
Also Read : సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారా? కేటీఆర్కు చెక్ పెట్టేందుకు హరీశ్ను వాడుకుంటున్నారా?