Padi Kaushik Reddy: ఇంకో రచ్చ.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సొంత పార్టీ నేతల తిరుగుబాటు? ఎందుకు?
వ్యక్తిగత ఎజెండాతో పాలిటిక్స్ చేస్తూ..ఏదో ఒక వివాదంలో తల దూరుస్తూ పార్టీని రచ్చకీడుస్తున్నాని కౌశిక్ వ్యతిరేకులు విమర్శిస్తున్నారు. క్యాడర్ను పట్టించుకోవడం లేదంటున్నారు.
Padi Kaushik Reddy Representative Image (Image Credit To Original Source)
- ఎప్పుడు ఏదో ఒక్క రచ్చతో కౌశిక్రెడ్డి హడావుడి
- సమ్మక్క సారలమ్మ జాతరలో రచ్చ చేసిన కౌశిక్రెడ్డి
- లేటెస్ట్గా సీపీ గౌస్ ఆలం టార్గెట్గా వరుస ఆరోపణలు
- ఎమ్మెల్యే కౌశిక్పై సొంత పార్టీ నేతల అసమ్మతి రాగం
- కారు దిగేందుకు సిద్ధమవుతున్న హుజురాబాద్ బీఆర్ఎస్ నేతలు..!
- అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో లోకల్ లీడర్లు
Padi Kaushik Reddy: ఇంటా, బయటా ఆయన లొల్లే. గతంలో గవర్నర్పై నోరు పారేసుకుని సారీ చెప్పారు. ఆ తర్వాత ఈటలను టార్గెట్ చేయబోయి ఇరకాటంలో పడ్డారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో వాగ్వాదానికి దిగి రచ్చ చేశారు. లేటెస్ట్గా సమ్మక్క సారలమ్మ జాతరలో రాద్దాంతం. ఆ తర్వాత సీపీపై అటాక్ చేస్తూ..కేరాఫ్ కాంట్రవర్సీగా.. వివాదాలకు మారు పేరుగా నిలుస్తున్నారు ఆ ఎమ్మెల్యే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఆయనపై అసమ్మతి రాగం వినిపిస్తుండటం హాట్ టాపిక్గా మారింది. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే? ఆయన దూకుడు కారు పార్టీకి ప్లస్సా? మైనస్సా?
వివాదాలే ఆయన జోలికి వస్తున్నాయో..లేక ఆయనే ఏరి కోరి మరీ కాంటవర్సీల్లో వేలు పెడుతున్నారో తెలియదు కానీ..నిత్యం ఏదో ఒక ఇష్యూతో హడావుడి చేస్తుంటారు హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి. కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి ఆయన వ్యవహారశైలి దూకుడుగా ఉంటూనే వస్తోంది. ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యాక అనవసర విషయాల జోలికి వెళ్లి పార్టీని రచ్చకీడుస్తున్నారన్న చర్చ ఉంది. గతంలో అప్పటి గవర్నర్ తమిళసై పై చేసిన వాఖ్యలు దుమారాన్ని రేపడంతో..ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను బూతులు తిట్టారనే అలిగేషన్తో పాటు, బీజేపీ నేత ఈటల రాజేందర్పై ఏవో కామెంట్స్ చేసి రచ్చకు దారితీశారు.
నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ..
ఆ మధ్య జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో వాగ్వాదం కేసులో అరెస్ట్ అయి..చివరకు బెయిల్పై రిలీజ్ అయ్యారు. అరికెపూడి గాంధీని పరుష పదజాలంతో విమర్శించడంతో పోటాపోటీ ఫిర్యాదులకు, దాడులకు దారితీసింది. లేటెస్ట్గా తన నియోజకవర్గంలో సమ్మక్క సారలమ్మ జాతరలో రాద్దాంతం చేసి..రోడ్డుపై బైఠాయించి సీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ అయ్యాయి. చివరకు ఐపీఎస్ల సంఘం డిమాండ్తో సారీ చెప్పాల్సి వచ్చింది. అప్పటి నుంచి కరీంనగర్ సీపీ గౌస్ ఆలంను టార్గెట్ చేస్తూ వస్తున్నారు కౌశిక్రెడ్డి. ఇదంతా ఆయన చేసిన రచ్చ, రాద్దాంతం అయితే..ఇప్పుడు సొంత పార్టీ నేతలే కౌశిక్రెడ్డి తీరుపై తిరుగుబావుట ఎగురవేస్తుండటం హాట్ టాపిక్గా మారింది.
వివక్ష చూపుతున్నారంటూ సీనియర్ల ఆవేదన..
కౌశిక్ రెడ్డి తీరును నిరసిస్తూ హుజురాబాద్ బీఆర్ఎస్ నేతలు రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం హాట్ టాపిక్గా మారింది. ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకోకపోవడం ఒక ఎత్తు అయితే, అధినేత దగ్గర తమను కనీసం పరిచయం కూడా చేయరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌశిక్రెడ్డి దూకుడుతో డ్యామేజ్ అవుతుందని..జమ్మికుంట మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్ లీడర్లపై కౌశిక్ వివక్ష చూపుతున్నారంటూ అసంతృప్త నేతలు గళం ఎత్తుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి తమకు అన్యాయం చేశారనేది వారి ప్రధాన ఆరోపణ. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి పోటీ చేసిన వారికి, తనకు సాన్నిహిత్యంగా ఉండే వారికే కౌశిక్ మద్దతు తెలిపారని ఫైర్ అవుతున్నారు. హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కౌశిక్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలే కారణమని మండిపడుతోంది క్యాడర్. ఎప్పుడో ఓసారి హుజురాబాద్కు వచ్చి హడావిడి చేసి..ఆ తర్వాత తమను రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోతారనేది కొందరు నాయకుల వాదన.
కౌశిక్రెడ్డి దూకుడుతో డ్యామేజ్ జరుగుతుందని ఆందోళన..
వ్యక్తిగత ఎజెండాతో పాలిటిక్స్ చేస్తూ..ఏదో ఒక వివాదంలో తల దూరుస్తూ పార్టీని రచ్చకీడుస్తున్నాని కౌశిక్ వ్యతిరేకులు విమర్శిస్తున్నారు. క్యాడర్ను పట్టించుకోవడం లేదంటున్నారు. పొలిటికల్గా కౌశిక్ రెడ్డి దూకుడు పార్టీకి, ఆయనకు ఎంత మైలేజ్ తెచ్చి పెడుతుందో ఏమో గానీ..నెగిటివిటీనే ఎక్కువ అవుతుందన్న టాక్ ఉంది. బీఆర్ఎస్ ముఖ్యనేతలు కూడా కౌశిక్రెడ్డి తీరుపై గుసగుసలు పెట్టుకుంటున్నారట. ఆయన దూకుడు పార్టీకి ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అనే దానిపై ఇంటర్నల్ డిస్కషన్ జరుగుతున్నట్లు టాక్. ఇప్పటికైనా కౌశిక్రెడ్డి తన తీరును మార్చుకుంటారో..ఎప్పటిలాగే దూకుడే ఎజెండాగా పెట్టుకుని వెళ్తారో చూడాలి.
Also Read: స్కీమ్స్ Vs స్కామ్స్.. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ వేళ పొలిటికల్ డైలాగ్ వార్
