Check Posts Close: రవాణా చెక్ పోస్టులు మూసివేత.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

చెక్ పోస్టుల వద్ద బోర్డులు, బారికేడ్లు తొలగించాలని డీటీవోలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Check Posts Close: రవాణా చెక్ పోస్టులు మూసివేత.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Updated On : October 22, 2025 / 6:42 PM IST

Check Posts Close: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రవాణా చెక్ పోస్టులు మూసివేస్తూ సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న సిబ్బందికి వేరే బాధ్యతలు అప్పగించాలన్నారు. రికార్డులు, పరికరాలు, ఫర్నీచర్ ను డీటీవో ఆఫీస్ కు తరలించాలన్నారు. అన్ని ఆర్థిక, పరిపాలన రికార్డులను సరిచూసి భద్రపరచాలని ఆదేశించారు. వాహన రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని, చెక్ పోస్టుల వద్ద బోర్డులు, బారికేడ్లు తొలగించాలని డీటీవోలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రాష్ట్రంలోని అన్ని రహదారులపై రవాణా చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చెక్ పోస్టుల మూసివేతపై పూర్తి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో తక్షణమే చెక్‌పోస్టుల కార్యకలాపాలు నిలిపివేయాలని ట్రాన్స్​పోర్ట్ కమిషనర్ ఆకస్మిక ఆదేశాలు జారీ చేశారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న సిబ్బందిని వెంటనే వేరే బాధ్యతల్లో వినియోగించుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. రహదారులపై వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని, చెక్ పోస్టుల వద్ద బోర్డులు, బ్యారికేడ్లు, తొలగించాలని డీటీవోలకు సూచించారు.

Also Read: జూబ్లీహిల్స్ తర్వాత గ్రేటర్‌లో మరో ఉపఎన్నిక ఖాయమా? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి?

ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. తెలంగాణలో చెక్ పోస్టులు రద్దు ఈరోజు నుండి అమలు చేస్తూ జీవో జారీ చేశారు. చెక్ పోస్టులు రద్దు చేస్తూ ప్రజల్లో అవగాహన కలిగించడానికి, పారదర్శకంగా ఆన్ లైన్ లో జరగడానికి చెక్ పోస్టులను రద్దు చేస్తూ 2నెలల క్రితం నిర్ణయం తీసుకొని ఈరోజు చెక్ పోస్టులు పూర్తిగా మూసేస్తూ అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణలో ఈవీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత 577 కోట్ల ట్యాక్స్ ప్రభుత్వం మినహాయించిందన్నారు.

”ఢిల్లీలో పొల్యూషన్ లో ఉండే పరిస్థితి లేదు. ఇక్కడ అలాంటి పరిస్థితి లేకుండా ఉండడానికి ఈవీ పాలసీ తీసుకొచ్చాం. నగరంలో 20వేల ఎలక్ట్రిక్ ఆటో లకు అనుమతి ఇచ్చాం. LPG, CNG ఆటోలకు రూ.10వేల చొప్పున అనుమతి ఇచ్చాం. 25వేల రేటిరో ఫిటింగ్ ఆటోలకు అనుమతి ఇచ్చాం. రాష్ట్రంలో వాహన్ అమలవుతుంది. సారథి త్వరలోనే తీసుకొస్తాం. స్క్రాపింగ్ పాలసీ తీసుకొచ్చాం. వాహనాలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేడియం స్టిక్కర్స్ అమలయ్యేలా తెచ్చాం. AI టెక్నాలజీ ఉపయోగించి రవాణా శాఖ కార్యాలయాల్లో రికార్డ్ చేస్తూ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళని నోట్ చేసి హెడ్ ఆఫీస్ కి అలెర్ట్ చేస్తుంది. అలాంటి వాటిని నిరోధించడానికి ఉపయోగిస్తున్నాం.

ఆటోమేటిక్ డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్ తీసుకొస్తున్నాం..

వెహికిల్ ట్రాకింగ్ ప్రాసెస్ కొనసాగిస్తున్నాం. డ్రైవింగ్ మీద మంచి నైపుణ్యాలు పెంచడానికి అవగాహన కలిగించడానికి కార్యక్రమాలు. రోడ్ సేఫ్టీపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. రోడ్ సేఫ్టీ చిల్డ్రన్ అవేర్ నెస్ పార్క్ లు ఏర్పాటు చేస్తున్నాం. నాచారంలో గవర్నర్ ప్రారంభించారు. కరీంనగర్ లో ప్రారంభించుకున్నాం. ఆటోమేటిక్ డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్ తీసుకొస్తున్నాం. టూరిజం వెహికల్స్ డబుల్ నెంబర్ ప్లేట్ తో పోతున్నాయని ఆరోపణల నేపథ్యంలో హై సెక్యూరిటీ ప్లేట్స్ తీసుకొస్తున్నాం.

రోడ్ సేఫ్టీ క్లబ్స్ కాలేజీలలో జూనియర్, డిగ్రీ ఇతర వాటిలో అవగాహన కల్పించేలా ఏర్పాటు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దాని అమలుపై మెడికల్, పోలీస్, నేషనల్ హైవేస్ తో సమీక్ష సమావేశం జరిగింది. రవాణ శాఖ రెవెన్యూ కలెక్షన్ చేసే డిపార్ట్ మెంట్. 112 మంది AMVI లను నియమించి వారికి శిక్షణ ఇచ్చి తీసుకున్నాం. నలుగురు ఆర్టీవోలు గ్రూప్ 1 ద్వారా వచ్చారు. రవాణా శాఖకు ఒక లోగో తీసుకొచ్చాం. తెలంగాణ పోలీస్, ఫారెస్ట్ మాదిరి లోగో తీసుకున్నాం. TS ను TG గా మార్చాం. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ఇల్లీగల్, ఓవర్ లోడింగ్ ఎన్ఫోర్స్ మెంట్ పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.

చెక్ పోస్టులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో 1.7 కోట్ల వాహనాలు ఉన్నాయి. వాటన్నిటిని రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం. డిపార్ట్ మెంట్ లో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. పాత వాహనాలు డబుల్ నెంబరింగ్ అరికట్టడానికి మైనింగ్, ఇతర వాహనాలకు మొదటగా చూస్తున్నాం. రవాణా శాఖలోని 63 కేంద్రాల్లో కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతుంది. బ్రోకర్ వ్యవస్థను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నాం.

పోలీస్ శాఖ, ఆర్టీసీ ఇతర విభాగాలలో పాత వాహనాలకు స్క్రాప్ కి పంపించాలని లేఖ రాశాం. చెక్ పోస్టులను రద్దు చేయాలని నేనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి కేబినెట్ లో పెట్టడం జరిగింది. వచ్చే ఆదాయాన్ని ఆన్ లైన్ ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం. గత పదేళ్లలో పాపాల పుట్టలా అవినీతి జరిగింది. వాహన్ సారథిలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. గత పదేళ్లలో తెలంగాణ ఎందుకు చేరలేదు. ఇప్పుడు మేము వాహన్ సారథి లో చేరాం. డేటా ట్రాన్స్ ఫర్మింగ్ జరుగుతుంది. వాహన్ అమలు చేస్తున్నాం. సారథి అమలు చేస్తాం. చెక్ పోస్టులు రద్దు చేసిన వాహనాల్లో అక్రమ రవాణ జరగకుండా ఎన్ ఫోర్స్ మెంట్ ఎక్కువగా చేస్తాం” అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.