అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు .. పార్టీ మారిన ఎమ్మెల్యేల కీలక సమావేశం.. ఏం జరుగుతోంది?
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Gudem Mahipal Reddy
సుప్రీంకోర్టు కేసు, తాజా నోటీసుల గురించి మాట్లాడడానికి పదిమంది ఎమ్మెల్యేలం సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రేపు అందరం కలిసి చర్చిస్తామని చెప్పారు. తాను ప్రస్తుతం హైదరాబాద్లో అందుబాటులో లేనని తెలిపారు. పది మంది ఎమ్మెల్యేలం కలిసి ఉమ్మడి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
కాగా, పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంలో తాజాగా కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన విజయం సాధించిన ఎమ్మెల్యేలలో 10 మంది కాంగ్రెస్లో చేరారు. వారికి అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేసి, రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని చెప్పారు.
కాగా, ఆ 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద ఇప్పటికే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. అలాగే, ఇదే విషయంపై మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేశారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిపై అనర్హత వేటు వేయాలన్నారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డితో పాటు కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపై ఫిబ్రవరి 10న విచారణ చేస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. ఆయా అంశాలపై 10 మంది ఎమ్మెల్యేలు చర్చించనున్నారు.
ఆ 10 మంది ఎమ్మెల్యేలు వీరే
- దానం నాగేందర్ (ఖైరతాబాద్)
- కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్)
- తెల్లం వెంకట్రావు (భద్రాచలం)
- ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్)
- బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల)
- పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ)
- అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి)
- గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్ చెరు)
- కాలె యాదయ్య (చేవెళ్ల)
- సంజయ్ కుమార్ (జగిత్యాల)
Also Read: పలు ప్రాంతాల్లో కోళ్ల మృతి.. చికెన్ తింటున్నారా? అధికారులు ఏమంటున్నారంటే?