Khammam Student Shot Dead : అమెరికాలో కాల్పులు.. ఖమ్మం విద్యార్థి మృతి..
డబ్బులు ఇచ్చిన తర్వాత సాయి తేజ ఛాతిపై కాల్చి పారిపోయారు.

Khammam Student Shot Dead : అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు సాయి తేజ మృతితో ఆయన కుటుంబంలో విషాదం అలుముకుంది. ఖమ్మం రాపర్తి నగర్ కు చెందిన సాయి తేజ ఎంఎస్ చదివేందుకు నాలుగు నెలల క్రితమే అమెరికాలోని చికాగో వెళ్లాడు. అక్కడే పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దుండగులు ముసుకు వేసుకుని వచ్చి సాయి తేజను డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇచ్చిన తర్వాత సాయి తేజ ఛాతిపై కాల్చి పారిపోయారు. బుల్లెట్ గుండెకు తాకడంతో సాయి తేజ అక్కడికక్కడే చనిపోయాడు. సాయి తేజ మృతితో ఖమ్మంలోని అతడి నివాసంలో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు సాయి తేజ అమెరికా వెళ్లాడు. నాలుగు నెలల క్రితమే అతడు అమెరికాలోని చికాగో వెళ్లాడు. అక్కడ ఓ పక్క చదువుకుంటూనే మరో పక్క పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సాయి తేజ పని చేస్తున్న ఫుడ్ స్టోర్ లోకి దుండగులు చొరబడ్డారు. డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. దాంతో సాయి తేజ క్యాష్ కౌంటర్ నుంచి డబ్బు తీసి వారికిచ్చాడు. డబ్బు తీసుకున్న దుండగులు.. అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ.. ఖమ్మం నగరానికి చెందిన సాయి తేజపై కాల్పులు జరిపారు. బుల్లెట్ నేరుగా గుండెలోకి దిగడంతో సాయి తేజ స్పాట్ లోనే చనిపోయాడు. దీంతో ఖమ్మం నగరంలోని రాపర్తి నగరంలో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని కన్నీటిపర్యంతం అయ్యారు.
”సాయి తేజ హైదరాబాద్ లో బీబీఐ పూర్తి చేశాడు. మాస్టర్స్ డిగ్రీ కోసం చికాగో పక్కనే ఉన్న కాంకోడియా యూనివర్సిటీలో చేరాడు. అక్కడికి వెళ్లిన నెల రోజుల్లోనే ఓ స్టోర్ లో పార్ట్ టైమ్ జాబ్ లో చేరాడు. ఐదు రోజులు కాలేజీకి వెళ్లే వాడు. రెండు రోజులు స్టోర్ లో పని చేసే వాడు. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3గంటల సమయంలో దుండగులు స్టోర్ లోకి చొరబడ్డారు. దీంతో క్యాష్ కౌంటర్ ను వారికి హ్యాండోవర్ చేసేసి సాయి తేజ పక్కకి వెళ్లాడు. దుండగులు క్యాష్ కౌంటర్ లో ఉన్న డబ్బు అంతా తీసుకున్నారు. డబ్బు తీసుకున్న తర్వాత కూడా అక్కడి నుంచి వెళ్తూ సాయి తేజపై అతి దగ్గరి నుంచి కాల్పులు జరిపారు. దీంతో సాయితేజ అక్కడికక్కడే మరణించాడు” అని మృతుడు సాయితేజ బంధువు తెలిపారు.
Also Read : ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర కోణం? దుమారం రేపుతున్న మంత్రుల వ్యాఖ్యలు..