Hyderabad: SRH టీం బస చేసిన హోటల్లో అగ్నిప్రమాదం..
హైదరాబాద్ లో ఎస్ఆర్ హెచ్ టీం సభ్యులు బస చేసిన హోటల్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

park hyatt hotel
Hyderabad: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పార్క్ హయత్ హోటల్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హోటల్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో హోటల్ అంతా దట్టమైన పొగ కమ్ముకుంది. హోటల్ లో ఉన్న టూరిస్టులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పలువురు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది హోటల్ వద్దకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్స్ లో పార్క్ హయత్ హోటల్ ఒకటి. అదే హోటల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ బస చేస్తోంది. శనివారం ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మళ్లీ ముంబైలో ఈనెల 17న ఎస్ఆర్ హెచ్ జట్టు ముంబై ఇండియన్స్ తో తలపడాల్సి ఉంది. దీంతో సమయంలో ఉండటంతో పార్క్ హయత్ హోటల్ లోనే ఎస్ఆర్ హెచ్ టీం ఉంది.
హోటల్ లోని మొదటి ఫ్లోర్ లో మంటలు చెలరేగడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎస్ఆర్ హెచ్ టీం ప్లేయర్లు, వారి కుటుంబ సభ్యులను అక్కడి నుంచి మరోచోటుకు తరలించినట్లు తెలిసింది. అగ్ని ప్రమాదంకు కారణాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ బస చేస్తోన్న హోటల్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవటంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు.