Rain Alert : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో మూడ్రోజులు వర్ష సూచన.. మే 6నుంచి భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ..
Rain Alert :ఆదివారం నుంచి మూడు రోజులపాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. మే6వ తేదీ నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
Rain Alert
- తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్
- వచ్చే మూడ్రోజులు పలు జిల్లాలకు వర్ష సూచన
- మే6 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
Rain Alert : తెలంగాణలో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ సమయాల్లో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. అయితే, ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. శనివారం ఈ సీజన్లోనే అత్యధికంగా నిజామాబాద్లో 46డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శనివారం నల్గొండ, నిర్మల్, సిద్ధిపేట జిల్లాల్లో 45.9 డిగ్రీల చొప్పు ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. అదిలాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే పరిస్థితి మరో రెండు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, ఎండలకు తోడు వర్షాలు కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సాయంత్రం వేళ ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే, వర్షాలపై తాజాగా వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.
తూర్పు తెలంగాణ జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఆదివారం నుంచి మూడు రోజులపాటు ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. మే6వ తేదీ నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం సమయంలో బయటకు వస్తే వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వడదెబ్బ నుంచి రక్షణకు తగినంత నీరు తాగాలని, మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిందని సూచనలు చేస్తున్నారు.
