ఎక్కడా రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదు: హరీశ్ రావుకి శ్రీధర్ బాబు కౌంటర్
ప్రతి అంశాన్నీ హరీశ్ రావు రాజకీయం చేయాలని చూస్తున్నారని చెప్పారు.

Sridhar Babu
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం మహేందర్ రెడ్డికి ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఎలా ఇస్తారని నిలదీసిన మాజీ మంత్రి హరీశ్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో ఎక్కడా రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదని అన్నారు. పీఏసీ చైర్మన్, చీఫ్ విప్ నియామకాలు రాజ్యాంగం ప్రకారమే జరిగాయని తెలిపారు.
ప్రతి అంశాన్నీ హరీశ్ రావు రాజకీయం చేయాలని చూస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయని తెలిపారు. తమ పార్టీకి చెందిన 12 మంది శాసనసభ్యులను బీఆర్ఎస్లో చేర్చుకున్నారని, సభ్యుల అనర్హత పిటిషన్లు కోర్టు పరిధిలో ఉన్నాయని చెప్పారు.
కాగా, అంతకు ముందు మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. చీఫ్ విప్గా మహేందర్ రెడ్డి నియామకం అయ్యారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నేతకు విప్ దక్కడం రాజ్యాంగ ఉల్లంఘన అని, పీఏసీ విషయంలో కూడా ఇదే జరిగిందని విమర్శించారు. మహేందర్ రెడ్డి పై అనర్హత పిటిషన్ మండలి చైర్మన్ దగ్గర పెండింగ్ లో ఉందని అన్నారు.