Minister Srinivas Goud: ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు పర్యటనపై మంత్రి శ్రీనివాస్గౌడ్ ఫైర్..
తెలంగాణలో అమలవుతున్న స్కీంలు మీరు అధికారంలోఉన్న రాష్ట్రాల్లో ఉన్నాయా అని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. పాలమూరు రైతులు బాగుపడుతుంటే చూడలేకపోతున్నారు.

Minister Srinivas Goud
PM Narendra Modi Palamuru Tour : ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1న పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. పాలమూరు వేదికగా పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు పర్యటనపై స్థానిక మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఏ మొహం పెట్టుకొని పాలమూరుకు వస్తున్నావు అంటూ ప్రశ్నించారు. గతంలో కూడా ఇక్కడే మీటింగ్ పెట్టి జాతీయ హోదా హామీ ఇచ్చారు. ప్రధాన మంత్రి హామీ ఇచ్చి నెరవేరకున్నా మళ్లీ అక్కడే మీటింగ్ పెడుతున్నారంటూ శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.
ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వమని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, హామీలు నెరవేర్చకున్నా మళ్లీ అక్కడే మీటింగ్ పెట్టడం మోదీకే సాధ్యం అయిందంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన ప్రధాని మోదీ.. తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కారని, అలాంటిది తెలంగాణకు ఎందుకు వస్తున్నారంటూ శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ప్రాజెక్ట్లకు పైసలు ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం అన్నీతానై ప్రాజెక్ట్ పూర్తి చేసిందని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నీటివాటా తేల్చకుండా నాన్చుతున్నారని అన్నారు. మోడీ మీటింగ్ ప్లేస్ నుండి చూస్తే కరివేన, ఉద్దండపూర్ రిజర్వాయర్లు, మెడికల్ కాలేజ్, ఐటీ టవర్ కనిపిస్తాయని, హైదరాబాద్ కు దీటుగా మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేస్తున్నామని, మోదీ పాలమూరు అభివృద్ధి చూసిపోవాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు.
తెలంగాణలో అమలవుతున్న స్కీంలు మీరు అధికారంలోఉన్న రాష్ట్రాల్లో ఉన్నాయా అని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. పాలమూరు రైతులు బాగుపడుతుంటే చూడలేకపోతున్నారు. కృష్ణా, తుంగభద్ర నదులు పారుతున్నా తాగునీరు, సాగునీరు లేక పాలమూరు ఘోస పడింది. మోదీ తెలంగాణలో కులం, మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి వస్తున్నారంటూ శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.