తీహార్ జైల్ నుంచి న్యాయమూర్తికి ఎమ్మెల్సీ కవిత లేఖ.. కీలక అంశాలు ప్రస్తావన.. అవేమిటంటే..?

తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత నాలుగు పేజీలతో కూడిన లేఖ ద్వారా తన వాదనలను జడ్జికి సమర్పించారు. నేను ఈ కేసులో బాధితురాలిని మాత్రమే.. నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

తీహార్ జైల్ నుంచి న్యాయమూర్తికి ఎమ్మెల్సీ కవిత లేఖ.. కీలక అంశాలు ప్రస్తావన.. అవేమిటంటే..?

mlc kavitha

MLC Kavitha Writes Four Page Letter : ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమెకు ఢిల్లీలోని సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించగా.. తీహార్ జైలుకు తరలించారు. ఆమె కస్టడీ ముగియడంతో మంగళవారం ఈడీ అధికారులు మరోసారి కోర్టులో కవితను హాజరుపర్చారు. కోర్టు ఈ నెల 23వ తేదీ వరకు కవిత కస్టడీని పొడిగించింది. అయితే, కవిత తీహార్ జైల్లోఉండి లేఖ రాశారు. నాలుగు పేజీలతో కూడిన లేఖలో తన వాదనలను జడ్జికి సమర్పించారు. నేను ఈ కేసులో బాధితురాలిని మాత్రమే.. నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

Also Read : మరో 14రోజులు.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు

దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్టు ఆర్థికంగా ఎలాంటి లబ్ధి నాకు చేకూరలేదని, సీబీఐ, ఈడీ దర్యాప్తు కంటే మీడియా విచారణ రెండున్నర ఏళ్లుగా జరిగింది. రాజకీయంగా, వ్యక్తిగా నా ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని లేఖలో కవిత పేర్కొన్నారు. నా మొబైల్ నెంబర్ ను టీవీ ఛానల్ లలో ప్రసారం చేసి నా ప్రైవసీని దెబ్బతీశారు. నాలుగు పర్యాయాలు విచారణకు హాజరయ్యాను. బ్యాంకు వివరాలుసైతం అధికారులకు ఇచ్చి విచారణకు అన్ని విధాలుగా సహకరించాను. దర్యాప్తు సంస్థకు నా మొబైల్ ఫోన్లు అన్నీ అందజేశాను. కానీ, వాటిని ద్వంసం చేసినట్లు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కవిత లేఖలో పేర్కొన్నారు.

Also Read : MLC Kavitha : రౌస్ అవెన్యూ కోర్టులో కవితకు దక్కని ఊరట

గత రెండున్నరేళ్లుగా కేసులో భాగంగా అనేక సోదాలు జరిపారు. భౌతికంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారు. చాలా మందిని అరెస్టు చేశారు. వాంగ్మూలాలు తరచూ మార్చుతూ వచ్చిన వారిని ఆధారంగా చేసుకొని కేసును నడిపిస్తున్నారని లేఖలో కవిత తెలిపారు. సాక్షులను బెదిరిస్తున్నట్టు నాపై ఆరోపణలు చేస్తున్న ఈడీ.. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని కవిత ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా నన్ను ఇప్పుడు అరెస్టు చేశారంటూ లేఖలో పేర్కొన్నారు. రెండున్నరేళ్ల విఫల దర్యాప్తు అనంతరం ఈడీ నన్ను అరెస్టు చేసింది. సుప్రీంకోర్టులో కఠిన చర్యలు తీసుకోబోమని చెప్పిన ఈడీ అధికారులు నన్ను అరెస్టు చేశారు. 95శాతం కేసులు అన్నీ ప్రతిపక్ష పార్టీల నేతలకు సంబంధించినవే. బీజేపీలోకి చేరిన వెంటనే ఆ కేసుల విచారణ ఆగిపోతుందని లేఖలో కవిత ఆరోపించారు.

Also Read : MLC Kavitha : నో బెయిల్.. రౌస్ అవెన్యూ కోర్టులో కవితకు దక్కని ఊరట

పార్లమెంటు సాక్షిగా బీజేపీ నేతలు విపక్ష నేతలను ఉద్దేశించి “నోరు మూసుకోండి లేదా ఈడీని పంపుతాం” అన్నారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో విపక్ష పార్టీలన్నీ న్యాయవ్యవస్థ వైపు చూస్తున్నాయి. న్యాయవ్యవస్థ ఉపశమనం కల్పిస్తుందని ఆశతో ఉన్నామని న్యాయమూర్తికి అందజేసిన లేఖలో కవిత కోరారు. కేసు దర్యాప్తునకు సహకరించేందుకు నేను పూర్తి సిద్ధంగా ఉన్నాను. ఈ పరిస్థితుల్లో నాకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నాను. నా చిన్న కుమారుడు పరీక్షలకు సిద్ధపడుతున్న సమయంలో తల్లిగా నేను తనతో ఉండాలి. నా పాత్రను ఎవరూ భర్తీ చేయలేరు. నేను లేకపోవడంతో నా కుమారుడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నాను. నా బెయిల్ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా మళ్లీ కోరుతున్నాను అంటూ నాలుగు పేజీల లేఖలో న్యాయమూర్తికి కవిత విజ్ఞప్తి చేశారు.