Pallavi Prashanth : బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసు.. పోలీసుల రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందునే ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. 41 సీఆర్ పీసీ నోటీసు ఇచ్చాకే ప్రశాంత్ ను అరెస్ట్ చేశామన్నారు పోలీసులు.

Pallavi Prashanth : బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసు.. పోలీసుల రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

Bigg Boss Winner Pallavi Prashanth Remand Report

Updated On : December 21, 2023 / 6:37 PM IST

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. పోలీసుల విధులకు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఆటంకం కలిగించాడని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ప్రశాంత్ కారణంగానే యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. పల్లవి ప్రశాంత్ అతడి అనుచరులను రెచ్చగొట్టడంతో వాహనాలు ధ్వంసం చేశారని పోలీసులు చెబుతున్నారు.

సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందునే ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పలుమార్లు పోలీసులు ప్రశాంత్ కు విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదని రిపోర్టులో పేర్కొన్నారు. 41 సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చాకే ప్రశాంత్ ను అరెస్ట్ చేశామన్నారు పోలీసులు.

బిగ్ బాస్ విన్నర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు అనేక అంశాలు పొందుపరిచారు. నిన్న ప్రశాంత్ ను అతడి ఇంట్లో అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. న్యాయమూర్తి ప్రశాంత్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. పల్లవి ప్రశాంత్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడు అనే ప్రధాన అభియోగం మోపారు. పల్లవి ప్రశాంత్ కారణంగానే దాదాపు 8 ఆర్టీసీ బస్సులు ధ్వంసం అయ్యాయి, పలువురు గాయపడ్డారు అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా ఉండేందుకు భయం ఉండాలనే ఉద్దేశంతోనే పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేశామన్నారు. పల్లవి ప్రశాంత్ బయటే ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అందుకే అదుపులోకి తీసుకున్నామని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. పల్లవి ప్రశాంత్ వల్లే అభిమానులు రోడ్లపైకి వచ్చారని, విధ్వంసం చేశారని, బిగ్ బాస్ షోకి వచ్చిన సెలెబ్రిటీల కార్లు కూడా ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చాకే పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేశామని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు పోలీసులు.

మరోవైపు బెయిల్ కోసం పల్లవి ప్రశాంత్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు వాదనలు వింది. అనంతరం తీర్పును రేపటికి వాయిదా వేసింది.