GHMC ఎన్నికలపై SEC దృష్టి, నవంబర్ లో నోటిఫికేషన్

Prepare bandobast plan for free and fair elections to GHMC : GHMC ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది. ప్రస్తుత పాలకవర్గం కాలపరిమితి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగుస్తుంది. అంతకు ముందుగానే.. డిసెంబర్లోగా ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు వీలుగా చర్యలు చేపట్టింది. ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల, కొత్త ఓటర్ల నమోదు.. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టింది.
150 వార్డులు, 74 లక్షల మంది ఓటర్లు :-
గ్రేటర్లోని 150 వార్డుల్లో 74 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితాల సవరణ తర్వాత ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎస్ఈసీ నిర్ణయించింది. ఓటర్లకు ఇబ్బంది లేకుండా సజావుగా పోలింగ్ పూర్తి చేసేందుకు GHMC పరిధిలో 8 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. ఇందుకు చర్యలు తీసుకోవాలని గ్రేటర్ ఆధికారులను ఆదేశించింది.
https://10tv.in/due-to-floods-ghmc-election-take-may-be-postponed/
బందోబస్తు ప్లాన్ :-
ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా జరిపేందుకు పోలీసు బలగాలు కీలకం కావడంతో బందోబస్తు ప్లాన్పై పోలీసు అధికారులతో చర్చలు జరిపింది. అక్రమ ఆయుధాల స్వాధీనంతో పాటు.. లైసెన్స్డ్ వెపన్స్ సంబంధిత పోలీసు స్టేషన్లలో డిపాజిట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది. బీట్ పెట్రోలింగ్ను పెంచడంతోపాటు సీసీ కెమెరాల ద్వారా శాంతిభద్రతలను నిరంతరం పర్యవేక్షించాలని SEC నిర్ణయించింది.
ఈ నెలలోనే నోటిఫికేషన్ :-
పోలింగ్లో మద్యం ప్రభావం లేకుండా చూసేందుకు వీలుగా ఓటింగ్కు ఒకరోజు ముందు నుంచి లిక్కర్ షాపుల మూసివేతపై ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టింది. ఎన్నికల్లో రౌడీ మూకులు రెచ్చిపోకుండా ముందుగానే కట్టడి చేయడంపై పోలీసు శాఖను ఆదేశాలు జారి చేసింది. ధన ప్రభావం లేకుండా చూసేందుకు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించింది. వ్యయ పరిశీలనకు ప్రత్యేకాధికారులను నియమించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రతిపాదించింది. GHMC ఎన్నికలకు ఈనెలలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.