ఆ పుస్తకాన్ని ఈ నియోజక వర్గంలో 75 వేల మందికి పంచుతాను: రఘునందన్ రావు
Raghunandan Rao: తాము దేశంలో బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించి పారదర్శకతను పెంచామని తెలిపారు.
దుబ్బాకకి తాను ఏమి చేశానో ఓ పుస్తకంలో రాయించి, తమ నియోజక వర్గంలో 75 వేల మందికి పంపిణీ చేస్తానని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాక అబివృద్ధిపై చర్చకు రావాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు సవాలు విసిరారు.
దుబ్బాకలో ఓడిపోయిన రఘునందన్ రావు మెదక్లో పనికి వస్తారా? అని మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని చెప్పారు. మరి కామారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గంలో ఓడిపోయిన కేసీఆర్ బస్సు యాత్ర ఎలా చేపడతారని నిలదీశారు. 2018లో కొడంగల్ అసెంబ్లీలో ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత మల్కాజిగిరి నుంచి పోటీ చేయలేదా అని ప్రశ్నించారు.
కేరళకు రేవంత్ రెడ్డి వెళ్లి అక్కడ కమ్యూనిస్టులను విమర్శిస్తున్నారని, అదే సమయంలో తెలంగాణలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కమ్యూనిస్టులతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. ఎవరి మాట నమ్మాలని నిలదీశారు. తెలంగాణలో బీజేపీకి 10కి మించి సీట్లు వస్తాయని చెప్పారు.
తాము దేశంలో బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించి పారదర్శకతను పెంచామని తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఉపాధి హామీ కూలీ డబ్బులు నేరుగా లబ్ధిదారుడి ఖాతాల్లో వేసిన ఘనత మోదీకి దక్కుతుందని చెప్పారు. ఇప్పుడు కూరగాయలు అమ్మే వారు కూడా డిజిటల్ పేమెంట్స్ పెట్టుకుంటున్నారని తెలిపారు.
శ్రీరామచంద్రుని నిజమైన వారసుడు రాహుల్ గాంధీయే : జగ్గారెడ్డి