వైఎస్ షర్మిలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం.. ఎందుకంటే?
వికారాబాద్లో నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
Revanth Reddy, YS Sharmila
- రాజకీయ వారసత్వం నుంచి షర్మిల వచ్చారు
- అయినప్పటికీ ఆ అవకాశాలను షర్మిల తీసుకోలేదు
- ముళ్లబాటలో కూడా కాంగ్రెస్ కోసం కష్టపడుతున్నారు
Revanth Reddy: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. రాజకీయ వారసత్వం నుంచి షర్మిల వచ్చినప్పటికీ ఆమె ఆ అవకాశాలను తీసుకోలేదని వ్యాఖ్యానించారు.
ముళ్లబాటలో కూడా ఏపీలో కాంగ్రెస్ కోసం షర్మిల కష్టపడుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల దగ్గరికి వెళ్లి రాజకీయాల్లో రాణించాలని షర్మిల చేస్తున్న కృషిని కాంగ్రెస్ శ్రేణులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
Also Read: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించాలి: హైకోర్టులో ఆళ్ల పిటిషన్
వికారాబాద్లో నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. 37 మంది ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్కు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చామని అన్నారు. పార్టీ బాధ్యతలు తీసుకున్న వారిని వెతికి మరీ పదవులు ఇచ్చామని తెలిపారు.
నాయకుల ప్రతి కదలికను గమనిస్తూనే ఉంటామని రేవంత్ రెడ్డి చెప్పారు. “మెరిట్ కోటా తప్పా కాంగ్రెస్ లో ఏ కోటా లేదు. మెరిట్ కోటాలో పాస్ అయితేనే పదవులు వస్తాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చాలా విలువైనది. ఈ పదవిని దుర్వినియోగం చేస్తే దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. డీసీసీ అధ్యక్ష పదవి మీ ఉన్నతికి తొలిమెట్టు. అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్ అగ్ర నాయకులను అవమానించాలని బీజేపీ కుట్ర చేస్తోంది. ఉండడానికి సొంత ఇల్లులేని నాయకులు రాహుల్ గాంధీ” అని తెలిపారు.
