మాస్క్ లేకుండా బయటకొస్తే రూ. వెయ్యి జరిమానా.. టెక్నాలజీ వాడనున్న పోలీసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు దారుణంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలో కరోనా కట్టడిలో భాగంగా మాస్క్లు లేకుండా బయటకు వచ్చేవారికి రూ. వెయ్యి జరిమానా విధిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ప్రభుత్వ ఆదేశాలతో దీనిని కఠినంగా అమలు చేయడానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధం అవుతున్నారు. మాస్కులు ధరించకుండా బయట తిరుగేవారిని గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఉపయోగించాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించుకున్నారు.
నగర పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీసులు మాస్క్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారిని గుర్తించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ను పోలీసులు వాడబోతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఈ టెక్నాలజీని అమలు చేయబోతున్నారు.
నగరంలో వాడిన తర్వాత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ వివరాలను హైదరాబాద్ అడిషనల్ పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తికి ఏ విధంగా చలాన్లు పంపించాలనే విషయాన్ని వర్కౌట్ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.