శ్రీవారికి నెయ్యి ఇచ్చేందుకు తెలంగాణ విజయ డెయిరీ సిద్ధం.. టీటీడీ ఈవోకు లేఖ

దేశ వ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తుల రంగంలో తెలంగాణ విజయ డెయిరీ సంస్థ ప్రసిద్ధి..

శ్రీవారికి నెయ్యి ఇచ్చేందుకు తెలంగాణ విజయ డెయిరీ సిద్ధం.. టీటీడీ ఈవోకు లేఖ

Updated On : September 21, 2024 / 7:51 PM IST

టీటీడీకి పాల ఉత్పత్తులు అందించడానికి తెలంగాణ విజయ డెయిరీ సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్ ఓ ప్రకటనలో తెలిపారు. స్వామివారికి సమర్పించే నైవేద్యాల కోసం స్వచ్ఛమైన, నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సబ్యసాచి ఘోష్ చెప్పారు.

ఈ మేరకు ఆయన టీటీడీ కార్యనిర్వహణ అధికారి జె.శ్యామలరావుకు శనివారం లేఖ ద్వారా ప్రభుత్వ ప్రతిపాదనను తెలిపారు. దేశ వ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తుల రంగంలో తెలంగాణ విజయ డెయిరీ సంస్థ ప్రసిద్ధి చెందినదని, వినియోగదారులకు విలువైన, నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేసిన చరిత్రను కలిగి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు.

విజయ డెయిరీ ఉత్పత్తులలో నాణ్యతను నిర్ధారించడంతో పాటు, లక్షలాది మంది పాల రైతుల జీవనోపాధికి సంస్థ తోడ్పడుతుందని ఆయన తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిక నాణ్యత గల నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల అవసరాలన్నింటినీ తీర్చడానికి విజయ డెయిరీ సంస్థ సన్నద్ధంగా ఉందని తెలిపారు.

విజయ డెయిరీ ప్రభుత్వ సంస్థ కావడంతో సరఫరాల స్వచ్ఛత, నాణ్యత, ధరల విషయంలో పూర్తి పారదర్శకంగా ఉంటుందని ఆయన చెప్పారు. దేవస్థానానికి, భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్ జె.శ్యామలరావు కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

తిరుమల లడ్డూ వివాదంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్