Medchal District : చెరువులో దూకి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన దొంగ.. అర్థరాత్రి తరువాత ఎస్కేప్
పోలీసులు, స్థానికులు ఎంతనచ్చజెప్పినా దొంగ మాత్రం బయటకు రాలేదు. రాత్రి 12.30 గంటల తరువాత పోలీసులుసైతం అక్కడి నుంచి వెనుదిరిగిపోయారు.

Thief in middle of pond
Suraram Robbery Case : సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాలయనగర్ నందు దొంతనానికి యత్నించిన ఓ దొంగ పోలీసులను, స్థానికులను ముప్పు తిప్పలు పెట్టాడు. శుక్రవారం శివాలయనగర్ లో ఓ ఇంటివారు తాళం వేసి ఫంక్షన్ కు వెళ్లారు. సాయంత్రం వచ్చి చూడగా.. బయట గేటుకు తాళం వేసి ఉన్నప్పటికీ ఇంటి తలుపు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా పడక గదిలో బీరువాలోని వస్తువులు పడేసి ఉండటమే కాకుండా ఓ వ్యక్తి అందులో కూర్చొని డబ్బులు లెక్కిస్తూ కనిపించాడు. వెంటనే కేకలు వేయడంతో.. స్థానికులు సదరు దొంగను వెంబడించారు. స్థానికుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో దొంగ నేరుగావెళ్లి చెరువులోకి దూకాడు.. చెరువు మధ్యలో ఓ బండరాయిపై కూర్చున్నాడు.
Also Read : Meteor Shower : ఐదురోజులు ఆకాశంలో అద్భుతం.. భూమిపైకి రాలే ఉల్కాపాతాలను నేరుగా చూడొచ్చు.. ఎలానో తెలుసా?
సూరారం పోలీసులు చెరువు వద్దకు చేరుకొని బయటకు రావాలని దొంగకు ఎంత నచ్చచెప్పినా వినిపించుకోలేదు.. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, టీవీ ఛానల్స్ వారు ఇక్కడికి వస్తేగానీ చెరువులో నుంచి బయటకురానని తెగేసి చెప్పాడు. రాత్రి పొద్దుపోయే వరకు సదరు వ్యక్తి చెరువు మధ్యలో బండరాయిపైనే ఉండిపోయాడు. బయటకు రావాలని దొంగను పలు విధాలుగా స్థానిక ఎస్ఐ కోరినప్పటికీ బయటకు వచ్చేందుకు దొంగ నిరాకరించాడు. రాత్రి 8.30 గంటల సమయంలో అడ్మిన్ ఎస్ఐ నారాయణ సింగ్ కూడా ఘటన స్థలికి వచ్చి దొంగను బయటకు రప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాత్రి 12.30 గంటల వరకు పోలీసులు అక్కడే వేచి ఉన్నారు.
పోలీసులు, స్థానికులు ఎంతనచ్చజెప్పినా దొంగ మాత్రం బయటకు రాలేదు. రాత్రి 12.30 గంటల తరువాత పోలీసులుసైతం అక్కడి నుంచి వెనుదిరిగిపోయారు. పోలీసులు, స్థానికులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో దొంగ పారిపోయాడు. అయితే, పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు కష్టార్జితం రూ. 20వేలు వరకూ దొంగ దోచుకుపోయాడని బాధితుడు వాపోయాడు.