ఎన్నికల వేళ తెలంగాణ‌ కాంగ్రెస్‌లో బీసీరాగం.. ఏం జరుగుతోందో తెలుసా?

BC Seats: ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ లోక్‌సభ ఎన్నికల్లోనే న్యాయం జరగాలనే బీసీ నేతల బిగ్‌ డిమాండ్‌పై కాంగ్రెస్‌ హైకమాండ్‌..

ఎన్నికల వేళ తెలంగాణ‌ కాంగ్రెస్‌లో బీసీరాగం.. ఏం జరుగుతోందో తెలుసా?

VH

Updated On : March 26, 2024 / 8:09 AM IST

తెలంగాణ‌ కాంగ్రెస్‌లో బీసీరాగం ఎత్తుకున్నారు నేతలు. కనీసం ఆరు పార్లమెంట్ స్థానాలు బీసీలకు ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి మాట ఇచ్చి త‌ప్పార‌ని గుర్రుగా ఉన్నారు బీసీ నేతలు. ప్రతి పార్లమెంట్ ప‌రిధిలో రెండు అసెంబ్లీ సీట్ల చొప్పున బీసీలకు 34 సీట్లు కేటాయిస్తామ‌ని మాటిచ్చారు. తీరా ఎన్నిక‌ల స‌మ‌యానికి కేవ‌లం 23 సీట్లు మాత్రమే ఇచ్చారంటున్నారు నేతలు.

అధికారంలోకి వ‌స్తే బీసీ కుల‌గ‌ణ‌న చేసి.. సామాజిక న్యాయం చేస్తామ‌ని రాహల్‌ గాంధీ చెబుతుంటే.. తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం బీసీల‌కు త‌గిన ప్రాధాన్యత ద‌క్కడం లేద‌ని వీహెచ్ వంటి సీనియ‌ర్లు వాపోతున్నారు. మ‌రోవైపు బీజేపీ ఐదు స్థానాలు, బీఆర్‌ఎస్ ఆరు స్థానాలు బీసీల‌కు కేటాయించాయి. దీంతో కాంగ్రెస్ పై కూడా బీసీ నేత‌లు మెజారిటీ సీట్లు కేటాయించాల‌ని ఒత్తిడి చేస్తున్నారు.

9 స్థానాల‌కు అభ్యర్థుల‌ ప్రకటన
తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటివ‌ర‌కు తొమ్మిది స్థానాల‌కు అభ్యర్థుల‌ను ప్రక‌టించింది. ఇందులో రెండు ఎస్సీ, ఒక‌టి ఎస్టీ రిజ‌ర్వుడు స్థానాల‌కు అభ్యర్థుల‌ను ప్రక‌టించింది. మిగ‌తా ఆరు స్థానాల్లో కేవ‌లం రెండు మాత్రమే బీసీల‌కు కేటాయించింది. జ‌హీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్‌, సికింద్రాబాద్ నుంచి దానం నాగేంద‌ర్‌లకు అవకాశమిచ్చింది అధిష్టానం.. ఇంకా ఎనిమిది స్థానాలు పెండింగ్‌లో ఉండ‌టంతో… వీటిలో క‌నీసం నాలుగు స్థానాలు బీసీల‌కు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు నేతలు.

కాంగ్రెస్‌ పార్టీలో జ‌రుగుతున్న చ‌ర్చ ప్రకారం మెద‌క్ పార్లమెంట్ స్థానం నుంచి బీసీ అభ్యర్థి నీలం మ‌ధు పేరు దాదాపు ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది. అలాగే బీసీల‌కు మ‌రో మూడు చోట్ల అవ‌కాశం క‌ల్పించాల‌ని నేత‌లు గ‌ట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఖ‌మ్మం టికెట్ కోసం సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత‌రావు డిమాండ్ చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో ఒక్క బీసీకి కూడా టికెట్ ఇవ్వలేద‌ని..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక‌ల్లో బీసీల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరుతున్నారు. అలాగే భువ‌న‌గిరి నుంచి పున్న కైలాష్ నేత టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ బీసీల‌కు టికెట్ ఇస్తే పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని కోమ‌టిరెడ్డి బ్రద‌ర్స్ బ‌హిరంగంగా ప్రక‌టిస్తున్నారు.

నిజామాబాద్ నుంచి బీసీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల ల‌లిత‌కు టికెట్ ఇవ్వాల‌ని పార్టీ సీనియ‌ర్ నేత ష‌బ్బీర్ అలీ సూచిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటు లోక్‌సభ ఎన్నికల్లోనే న్యాయం జరగాలనే బీసీ నేతల బిగ్‌ డిమాండ్‌పై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read: ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా బీఆర్ఎస్ పొలంబాట కార్యాచరణ