టీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోస్టుకు ఫుల్లు గిరాకీ!

దీంతో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లుగా న‌లుగురు లేదా ఐదుగురిని నియమించాలని పార్టీ అధిష్ఠానం..

టీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోస్టుకు ఫుల్లు గిరాకీ!

Telangana congress working president

Updated On : September 16, 2024 / 9:40 PM IST

తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ పోస్ట్‌కు య‌మా క్రేజ్. పీసీసీ చీఫ్ పదవి కన్నా, ఇప్పుడు ఆ పోస్టుకే ఫుల్ డిమాండ్. కాంగ్రెస్‌ నేతలు అంతా ఆ పోస్టునే ఎందుకు కోరుకుంటారంటే…. ఆ పోస్టులోనే అదృష్టముందని చెబుతున్నారు. ఆ పోస్టు ద‌క్కించుకున్న నేత ప్యూచ‌ర్‌ ఎక్కడికో వెళ్లిపోతోందట…. అందుకే ఇప్పుడు ఆ పోస్టు కోసం ఢిల్లీ స్థాయిలో పైర‌వీలు జ‌రుగుతున్నాయి. ఇంత‌కీ కాంగ్రెస్‌లో అంత డిమాండ్‌ ఉన్న పోస్టు ఏంటని సందేహిస్తున్నారా? మరెందుకు ఆలస్యం ఈ స్టోరీ చూడండి….

కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత మొట్టమొద‌టిసారిగా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును క్రియేట్ చేశారు. ఈ పోస్టును ఎవ‌రు ద‌క్కించుకుంటే వారిని అదృష్టం అతుక్కుపోతుందనే టాక్‌ ఉంది. టి.కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా పనిచేసిన వారంద‌రికి ఆ త‌ర్వాతి కాలంలో మంచి మంచి అవ‌కాశాలు వచ్చాయని చెబుతున్నారు. ఇది గుడ్డి నమ్మకం కాదని… క‌ళ్ల ముందు క‌నిపించే వాస్తవమంటూ ఉదాహకరణలతో సహా వివరిస్తున్నారు.

అప్పట్లో అలా..
తెలంగాణ ఏర్పడిన‌ సమయంలో పీసీసీ చీఫ్‌గా పొన్నాల ల‌క్ష్మయ్యకు ఛాన్స్ ద‌క్కింది. అప్పుడు మొట్ట మొద‌టి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి అవ‌కాశం ల‌భించింది. ఆ త‌ర్వాత జ‌న‌ర‌ల్ ఎల‌క్షన్స్‌లో పార్టీ బ‌ల‌హీన ప్రదర్శన కార‌ణంగా అధిష్టానం పొన్నాల‌ను త‌ప్పించింది. అప్పటి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌కు పీసీసీ చీఫ్‌గా ఛాన్స్ ఇచ్చింది. అలా పీసీసీ చీఫ్ ఛాన్స్ ద‌క్కించుకున్న ఉత్తమ్‌.. దాదాపు ఏడేళ్ల పాటు ఆ ప‌ద‌విలో కొన‌సాగారు.

ఇక వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా పీసీసీ చీఫ్‌గా పనిచేసిన ఉత్తమ్‌కు పార్టీలో పట్టు బాగా పెరిగింది. ఢిల్లీ పెద్దల వద్ద కూడా మంచి గుర్తింపే ఉంది. అలా పార్టీలో ముఖ్యమైన నేత‌ల్లో ఒక‌రుగా ఉత్తమ్ మారిపోయిన ఉత్తమ్‌ ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఉత్తమ్‌ తర్వాత వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఛాన్స్ మ‌ల్లు భ‌ట్టి విక్రమార్కకు ద‌క్కింది.

ఆ త‌ర్వాత భ‌ట్టి సీఎల్పీ ప్రచార క‌మిటీ చైర్మన్‌గా, సీఎల్పీ లీడ‌ర్‌గా ఎంపికయ్యారు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప‌నిచేసిన భ‌ట్టి ఇప్పుడు ప్రభుత్వంలో నెంబర్‌2గా వ్యవహరిస్తున్నారు. భట్టి తర్వాత వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన వారిలో రేవంత్ రెడ్డి సీఎం అవ్వగా, పొన్నం ప్రభాక‌ర్‌కు మంత్రి యోగం పట్టింది. ఆఖ‌రికి మొన్నటికి మొన్న వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ విత్ ఆర్గనైజేష‌న్ ఇంచార్జ్‌గా ఉన్న మ‌హేష్‌కుమార్ గౌడ్ రాత కూడా మారిపోయింది. ఇప్పుడు ఆయ‌న పీసీసీ చీఫ్ ఛాన్స్ కొట్టేశారు.

త‌ల‌రాత మారిపోతోందనే టాక్‌
ఇలా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఛాన్స్ దొరికిన ప్రతి ఒక్కరి త‌ల‌రాత మారిపోతోందనే టాక్‌తో ప్రస్తుతం ఈ పోస్టుకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ముఖ్య పదవులు ఆశిస్తున్న నేత‌లంతా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ పోస్టు కోసం భారీ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. కొంద‌రు నేత‌లైతే ఢిల్లీ లెవల్లో పైర‌వీ చేస్తున్నారు. త‌మ‌కు అవ‌కాశం ఉన్న నేత‌లంద‌రితో దీని కోస‌మే ప‌ట్టుబ‌డుతున్నారు.

దీంతో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లుగా న‌లుగురు లేదా ఐదుగురిని నియమించాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. సామాజిక స‌మీక‌ర‌ణాల ఆధారంగా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ను భ‌ర్తీ చేయాల‌ని చూస్తోంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా బీసీ నేతను నియమించడంతో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇతర సామాజికవర్గ నేతలకు అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా వర్కింగ్‌ ప్రెసిడెంట్ల జాతకాలు తర్వాత మారిపోవడంతో చాలా మంది నేతలు ప్రస్తుతం ఢిల్లీకి క్యూ కడుతున్నారు.


ఇంతకీ గాంధీ ఎవరి పార్టీ? తెలంగాణ కాంగ్రెస్‌ కన్ఫ్యూజన్‌లో ఉందా?