Komatireddy Venkat Reddy : 45 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం రద్దు కాబోతోంది- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy Venkat Reddy : స్కూటర్ మీద తిరిగిన జగదీష్ రెడ్డి లాగా అక్రమంగా వేల కోట్లు సంపాదించలేదు. నాలుగు పార్టీలు మారిన సుఖేందర్ రెడ్డి 12 కార్లలో తిరుగుతాడు.

Komatireddy Venkat Reddy : 45 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం రద్దు కాబోతోంది- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komati Reddy Venkat Reddy

Updated On : July 10, 2023 / 8:20 PM IST

Komatireddy Venkat Reddy – Telangana Government : మరో 45 రోజుల్లో తెలంగాణలో ప్రభుత్వం రద్దు కాబోతోందా? అంటే, అవుననే అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత. యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలం పాటిమట్ల వద్ద నేషనల్ హై వే నిర్మాణ పనులను భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేశారు.

తెలంగాణ రాష్ట్రంలో 45 రోజుల్లో ప్రభుత్వం రద్దు కాబోతోందని ఆయన బాంబు పేల్చారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా మాజీలు కాబోతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. గౌరెల్లి నుండి కొత్తగూడెం వరకు 2వేల కోట్లతో నేషనల్ హైవేని కేంద్రమంత్రి ద్వారా నేను మంజూరు చేయించాను అని ఆయన తెలిపారు. జాతీయ రహదారులు ఎప్పుడైనా స్థానిక ఎంపీ అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని కోమటిరెడ్డి గుర్తు చేశారు. అది కూడా తెలియని కేటీఆర్ అమెరికాలో చదువుకొని వచ్చారని విమర్శించారు.

Also Read: కడియం శ్రీహరి పెద్ద అవినీతి తిమింగలం.. ఎమ్మెల్యే రాజయ్య సంచలన ఆరోపణలు

”ఇసుక మాఫియాలో, వైన్ మాఫియాలో గల్లీల్లో తిరిగే గాదరి కిషోర్ కి ఢిల్లీ ఎక్కడుందో తెలుసా? జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అక్రమంగా సంపాదించిన 3 వేల కోట్లతో శంషాబాద్ దగ్గర 80 ఎకరాల భూమి కొన్నారు. అక్రమ సంపాదనలో గాదరి కిషోర్, జగదీశ్ రెడ్డి తో పోటీ పడుతున్నారు. కోమటిరెడ్డి బెంజ్ కారులో తిరుగుతాడు అని నన్ను విమర్శిస్తున్నారు. నేను 30 సంవత్సరాల క్రితం యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడే బెంజ్ కారులో తిరిగాను. కష్టపడి వ్యాపారాలు చేసి సంపాదించాను.

కానీ స్కూటర్ మీద తిరిగిన జగదీష్ రెడ్డి లాగా అక్రమంగా వేల కోట్లు సంపాదించలేదు. అక్రమాలు ఆగాలన్నా, తెలంగాణ లూటీ ఆగాలన్నా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఐటీ మినిష్టర్ అయ్యిండి కూడా కేటీఆర్ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఎవరున్నా మొదటి సంతకం మాత్రం 4వేల రూపాయల పెన్షన్ పైనే. ఈ నెల 20న కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ పాల్గొనబోయే సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించబోతున్నాము. నాలుగు పార్టీలు మారిన సుఖేందర్ రెడ్డి 12 కార్లలో తిరుగుతాడు. అంత ప్రాణ భయం దేనికి?” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.

Also Read: జగన్‌ను నేను కలవలేదు.. షర్మిల చేరిక విషయంపై క్లారిటీ ఇచ్చిన పొంగులేటి