KTR: కేటీఆర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందేనని సూచించిన కోర్టు

తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది.

KTR: కేటీఆర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందేనని సూచించిన కోర్టు

Telangana High Court dismissed KTR Quash Petition

Updated On : January 7, 2025 / 11:47 AM IST

Formula E Car Race Case: తెలంగాణ హైకోర్టు (Telangana High Court) లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కు ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా ఈ-కారు రేసు (Formula E Car Race) కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ ఇటీవల హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరగ్గా తుదితీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. దీంతో మంగళవారం హైకోర్టు తీర్పునిచ్చింది. ఏసీబీ కేసును కొట్టివేయాలన్నకేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ వాదనలతో ఏకీంభవించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులనుసైతం ఎత్తివేసింది.

Also Read: Allu Arjun : శ్రీతేజ్‌ను ప‌రామ‌ర్శించిన అల్లు అర్జున్‌..

చట్టప్రకారం నడుచుకోవాలని, అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని హైకోర్టు పేర్కొంది. కేటీఆర్ అరెస్ట్ పై స్టే నుకూడా హైకోర్టు ఎత్తివేసింది. దీంతో ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. హరీశ్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్ నివాసంకు చేరుకొని తదుపరి కార్యాచరణపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, హైకోర్టులో చుక్కెదురు కావడంతో కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఏసీబీ సోదాలు..
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచింది. మాదాపూర్ లోని గ్రీన్ కో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో గ్రీన్ కో అనుబంధ సంస్థల ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. 2022 అక్టోబరు 25న ఫార్ములా ఈ-కారు రేసు నిర్వహణకు సంబంధించి ఒప్పంద జరిగింది. అంటే అంతకుముందే గ్రీన్ కో అనుబంధ సంస్థల నుంచి రెండు దఫాలుగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి 41కోట్ల రూపాయలు జమ చేయడంపై ఏసీబీ దృష్టిసారించింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం నుంచి గ్రీన్ కో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.

 

కేటీఆర్ అరెస్టు తప్పదా..?
హైకోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ -కారు రేసు కేసులో మరింత దూకుడుగా ముందుకెళ్లనున్నారు. ఇవాళే కేటీఆర్ కు ఏసీబీ మరో నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. రేపు లేదా ఎల్లుండి విచారణకు పిలుస్తారని సమాచారం. కేటీఆర్ ఈడీ విచారణకు ఇవాళే వెళ్లాల్సి ఉంది. కానీ, హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఉంది.. తనకు విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని ఈడీ అధికారులను కేటీఆర్ కోరారు. దీంతో ఈడీ అధికారులు కేటీఆర్ విజ్ఞప్తికి సుముఖత వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటీషన్ కొట్టివేయడంతో ఏసీబీతో పాటు ఈడీ అధికారులుసైతం కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి రెండుమూడు రోజుల్లోనే విచారణకు రావాలని ఆదేశించే అవకాశాలు లేకపోలేదు. విచారణ సమయంలో కేటీఆర్ ను అరెస్టు చేస్తారన్న వాదన ఉంది. అయితే, హైకోర్టు తీర్పు, తదనంతరం జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.