TSPSC Group 1 Prelims : గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ.. టీఎస్పీఎస్సీపై కోర్టు సీరియస్, నోటీసులు జారీ
TSPSC Group 1 Prelims : పరీక్ష నిర్వహణలో ఖర్చుల విషయం ముఖ్యం కాదంది. పరీక్ష నిర్వహణ కోసం అభ్యర్థుల నుంచి ఫీజు తీసుకున్నారు కదా అని కమిషన్ ను నిలదీసింది.

TSPSC Group 1 Prelims (Photo : Google)
Group 1 Prelims – High Court : గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా టీఎస్ పీఎస్ సీపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఓఎంఆర్ పై హాల్ టికెట్ నెంబర్, ఫోటో ఎందుకు లేవు అని కోర్టు ప్రశ్నించింది. పరీక్షల్లో అక్రమాలు నిరోధించడంలో కీలక అంశాలు ఎందుకు విస్మరించారని అడిగింది. బయోమెట్రిక్, ఫోటో పెట్టడానికి కోటి 50లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని టీఎస్ పీఎస్ సీ చెప్పగా.. పరీక్ష నిర్వహణలో ఖర్చు ముఖ్యం కాదని కోర్టు వ్యాఖ్యానించింది.
విచారణ సందర్భంగా పిటిషనర్లు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించకపోవడం, ఓఎంఆర్ షీటుపై హాల్ టికెట్, ఫోటో లేకపోవడం అనుమానంగా ఉందన్నారు పిటిషనర్లు. ఓఎంఆర్ షీటుపై హాల్ టికెట్ నెంబర్, ఫోటో ఎందుకు లేవని హైకోర్టు ప్రశ్నించింది.
అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు సేకరించలేదని టీఎస్ పీఎస్ సీ ని అడిగింది హైకోర్టు. అక్టోబర్ లో చేసినవన్నీ రెండోసారి ఎందుకు చేయలేదని కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది. పరీక్షల్లో అక్రమాలు నిరోధించడంలో కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించారు అని కూడా హైకోర్టు అడిగింది. పరీక్షల ఏర్పాట్లు ఎలా చేయాలన్నది టీఎస్ పీఎస్ సీ విచక్షణ అధికారం అని కమిషన్ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏర్పాట్లపై అభ్యర్థులెవరూ అభ్యంతరం చెప్పలేదని టీఎస్ పీఎస్ సీ తెలిపింది. బయోమెట్రిక్, ఓఎంఆర్పై ఫోటోకు సుమారు రూ.1.50 కోట్లు అవుతుందని వెల్లడించింది. ఆధార్ వంటి గుర్తింపు కార్డు ద్వారా ఇన్విజిలేటర్లు అభ్యర్థులను ధ్రువీకరించారని కోర్టుకి వివరించింది.
Also Read..Revanth Reddy: అప్పట్లోగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది: రేవంత్ రెడ్డి
విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్ష పారదర్శకంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేయడం టీఎస్ పీఎస్ సీ బాధ్యత అని వ్యాఖ్యానించింది. పరీక్ష నిర్వహణలో ఖర్చుల విషయం ముఖ్యం కాదంది. పరీక్ష నిర్వహణ కోసం అభ్యర్థుల నుంచి ఫీజు తీసుకున్నారు కదా అని కమిషన్ ను నిలదీసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్ పీఎస్ సీకి నోటీసులు జారీ చేసింది కోర్టు.