రోడ్డు ప్రమాదం: కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాథోడ్‌కు తీవ్రగాయాలు

  • Published By: veegamteam ,Published On : April 10, 2019 / 02:06 AM IST
రోడ్డు ప్రమాదం: కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాథోడ్‌కు తీవ్రగాయాలు

Updated On : April 10, 2019 / 2:06 AM IST

ఆదిలాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్‌ లోక్ సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రమేశ్‌ రాథోడ్‌ కు తీవ్ర గాయాలు అయ్యాయి. రమేశ్ రాథోడ్ ప్రయాణిస్తున్న వాహనం చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుకు అడ్డుగా  వచ్చిన పందిని తప్పించే క్రమంలో వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. తల, ఛాతి, కాలేయానికి తీవ్ర గాయాలయ్యాయి. అనుచరులు వెంటనే రమేశ్ రాథోడ్ ని ఆదిలాబాద్ రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో రమేశ్ రాథోడ్ తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. కారు డ్రైవర్, రమేష్ రాథోడ్ గన్ మన్ కూడా గాయపడ్డారు. రమేశ్ రాథోడ్ ఎన్నికల ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్తుండగా మంగళవారం (ఏప్రిల్ 9) రాత్రి ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్‌లోని మావల గ్రామం దగ్గర ప్రమాదం జరిగింది.

వైద్యులు రమేశ్ రాథోడ్ ని 48 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచారు. ఆయన ప్రాణానికి ముప్పేమీ లేదన్నారు. 2009 ఎన్నికల్లో రమేశ్ రాథోడ్.. టీడీపీ తరపున ఆదిలాబాద్ నుంచి లోక్‌సభకు ఎంపికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో ఆయన టీఆర్‌ఎస్ లో చేరారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల  సమయంలో ఖానాపూర్ స్థానం నుంచి టీఆర్‌ఎస్ పార్టీ తరఫున టికెట్ ఆశించి భంగపడ్డ రమేశ్ రాథోడ్.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ బరిలో ఉన్నారు.