ప్రాణాలు తీస్తోంది : డెంగీతో డాక్టర్ మృతి

గుంటూరులో సీనియర్‌ యూరాలజిస్ట్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) నగర మాజీ అధ్యక్షుడు, డాక్టర్‌ అలపర్తి లక్ష్మయ్య డెంగీ జ్వరంతో మృతి చెందాడు.

  • Published By: veegamteam ,Published On : September 22, 2019 / 04:22 AM IST
ప్రాణాలు తీస్తోంది : డెంగీతో డాక్టర్ మృతి

Updated On : September 22, 2019 / 4:22 AM IST

గుంటూరులో సీనియర్‌ యూరాలజిస్ట్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) నగర మాజీ అధ్యక్షుడు, డాక్టర్‌ అలపర్తి లక్ష్మయ్య డెంగీ జ్వరంతో మృతి చెందాడు.

గుంటూరులో సీనియర్‌ యూరాలజిస్ట్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) నగర మాజీ అధ్యక్షుడు, డాక్టర్‌ అలపర్తి లక్ష్మయ్య డెంగీ జ్వరంతో మృతి చెందాడు. చికిత్స పొందుతూ శనివారం (సెప్టెంబర్ 21, 2019) మృతి చెందారు. నగరంపాలెంలోని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ ఇంటి ఎదుట సదరు వైద్యుడు నందన హాస్పిటల్‌ పేరుతో హాస్పిటల్ నిర్వహిస్తున్నారు.

నాలుగు రోజుల కిందట డాక్టర్‌ లక్ష్మయ్య జ్వరంతో బాధపడుతూ అరండల్‌పేటలోని ప్రైవేటు వైద్యశాలలో చేరారు. అక్కడి వైద్య పరీక్షల్లో డెంగీ జ్వరంగా నిర్ధారణ అయ్యింది. రెండు రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో విజయవాడ సమీపంలోని మణిపాల్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మరణించారు. లక్ష్మయ్య మృతి పట్ల నగర ఐఎంఏ కార్యవర్గం సంతాపం వ్యక్తం చేసింది.

గుంటూరులో మరో ఇద్దరు వైద్యులు, ఒక వైద్య విద్యార్థి కూడా డెంగీతో బాధపడుతున్నారు. వీరిలో ఒక డాక్టర్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్సలు అందిస్తున్నట్లు తెలిసింది. డెంగీ రోగులను ఐసీయూలో ఉంచి చికిత్సలు చేస్తున్న సమయంలో డాక్టర్లు ఆయా రోగులను దోమ తెరల మధ్య ఉంచాలి. దీనివల్ల ఆ రోగుల నుంచి డెంగీ కారకాలు డాక్టర్లకు వ్యాపించకుండా ఉంటాయి. అయితే, చాల మంది వైద్యులు డెంగీ రోగులకు కూడా సాధారణ రోగుల్లానే చికిత్సలు చేస్తున్నారు. దీనివల్ల వైద్యులు, సిబ్బంది డెంగీ బారిన పడుతున్నట్లు భావిస్తున్నారు.

గుంటూరులో డెంగీ పెద్ద ఎత్తున విజృంభించడంతో కేవలం మూడు రోజుల్లోనే 41 కేసులు నమోదయ్యాయి. ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లోనే 400లకు పైగా డెంగీ కేసులు, 148 మలేరియా కేసులు నమోదయ్యాయి. నగర వ్యాప్తంగా దోమల నియంత్రణకు మలాథియాన్‌, సైపనో మిథ్రిన్‌ చల్లుతున్నారు.