ప్రేమ జంటల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి

ప్రేమ జంటల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఇటు ప్రియుడు, అటు ప్రియురాలి కుటుంబంలో ఎవరో ఒకరి వైపు నుంచి ప్రేమ వివాహానికి వ్యతిరేకత వ్యక్తమైందన్న ఉద్దేశంతో తనువుచాలించే ప్రేమ జంటలు ఎక్కువ అవుతున్నాయి. అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నారు. కన్నతల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చప్టా (కే) గ్రామంలో ఇదే కారణంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడు రవి సొంత చేనులో చెట్టుకు ఉరివేసుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడు రవితో జీవితం పంచుకోవాలనుకున్న తన కోరిక నెరవేరలేదన్న మనస్తాపంతో ప్రియురాలు అనిత కూడా వంటిపై కిరోసిన్ పోసుకుని ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో ప్రేమ జంట విశాఖపట్నం పర్యాటక ప్రాంతంలో ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం అడారు గ్రామానికి చెందిన సత్యనారాయణ, కమల ప్రేమించుకున్నారు. కానీ పెద్దలు వ్యతిరేకిస్తారన్న ఉద్దేశంతో ప్రేమ విషయం వారికి చెప్పారు. హైదరాబాద్లో ఉండే సత్యరానాయణ, విశాఖలో ఉంటే కమల.. విశాఖ కైలాస్గిరిలో కలుసుకున్నారు. ప్రేమకు పెద్దలు అంగీకరించరన్న ఉద్దేశంతో బాదంపాలలో పురుగు మందు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీంత అడారి గ్రామంలో విషాదం నెలకొంది. కమల బ్యాగ్ నుంచి పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబంతో సంతోషంగా కలిసి ఉండాలనుకున్నా .. తమకు ఆ అదృష్టం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలని.. ఇదే తన చివరి కోరిక అని కమల సూసైడ్ నోట్లో రాశారు.
తూర్పుగోదావరి జిల్లా దవళేశ్వరంలో ఓ యువజంట ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న యువజంటను జగదీశ్, దీప్తిగా గుర్తించారు. ఇద్దరూ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. జగదీశ్, దీప్తికి ఎనిమిది నెలల క్రితం పెళ్లైంది. గతంలో వస్త్ర దుకాణంలో పనిచేసిన జగదీశ్.. కొంత కాలంగా ఖాళీగా ఉంటున్నాడు. ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.