ఏపీలో ఆన్లైన్లోనే ఇసుక: బుక్ చేసుకోండి ఇలా

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఇసుక విధానం అమల్లోకి తీసుకుని వచ్చింది ప్రభుత్వం. ఇందుకోసం ప్రభుత్వం వెబ్ అప్లికేషన్ ను కూడా తీసుకుని వచ్చింది. పారదర్శకంగా పాలన ఉండాలనే ఉద్ధేశ్యంతో ఇసుక విధానంలో మార్పులు తీసుకుని వచ్చిన ప్రభుత్వం.. ఆన్లైన్ విధానాన్ని అమలులోకి తీసుకుని వచ్చింది. ఇకపై ఎవరికి ఇసుక కావాలన్నా కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇసుకను బుక్ చేసుకోవాలంటే ఏమి చేయాలి? బుకింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది? రిజిస్ర్టేషన్ ఎలా చేసుకోవాలి? ఆర్డర్ ఎలా ఇవ్వాలి? మీ అర్డర్ ప్రకారం మీకు ఇసుకను ఎంత కేటాయిస్తారు? అనే వివరాలను ప్రభుత్వం ప్రకటించింది.
కొత్త ఇసుక విధానం ప్రకారం సాధారణ వినియోగదారులు మొదలు, బల్క్ కన్జ్యూమర్ల వరకు ఎవరైనా సరే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వెబ్ అప్లికేషన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవాలి. వెబ్ అప్లికేషన్ ద్వారా బుకింగ్ చేసుకోవడం చాలా ఈజీ. చదువుకున్న వ్యక్తులైతే నేరుగా మీ మొబైల్, టాబ్లెట్, పీసీ, ల్యాప్టాప్ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. చదువుకోని వాళ్లు అయితే ఇంటర్ నెట్ సెంటర్ల నిర్వాహకులను, మీ-సేవా నిర్వాహకులను, కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులను కలిసి వారి సహాయంతో బుకింగ్ చేసుకోవచ్చు.
ఇసుక కావాల్సిన వారు ముందుగా ప్రభుత్వం రూపొందించిన శాండ్ సేల్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ డ్యాష్బోర్డు (వెబ్ అప్లికేషన్) ద్వారా బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ చేసుకోవాలంటే ముందుగా www.sand.ap.gov.in వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. వెల్కమ్ టూ ఏపీ శాండ్ పోర్టల్ పేజీ ఓపెన్ అవుతుంది. ముందుగా రిజిస్ర్టేషన్ మెనూలోకి వెళ్ళాలి. ఇందులో రెండు రకాల ఆప్షన్లు ఉంటాయి. ఒకటి జనరల్ కన్జ్యూమర్. రెండవది బల్క్ కన్జ్యూమర్. మీ కేటగిరిని బట్టి ఒక దాన్ని క్లిక్ చేసి మీ వ్యక్తిగత అవసరాల కోసం, మీ సొంత గృహ నిర్మాణం, మరమ్మతుల కోసం బుక్ చేసుకునే వారు జనరల్ కన్జ్యూమర్ కేటగిరీలోకి వస్తారు. బిల్డర్లు, డెవలపర్లు తదితరులు బల్క్ కన్జ్యూమర్ల కేటగిరీలోకి వస్తారు. మీ కేటగిరీని బట్టి జనరల్, బల్క్ కన్జ్యూమర్లలో ఏదో ఒకదానిని ఎంచుకున్న తర్వాత మీరు రిజిస్ర్టేషన్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇదే:
మీరు వ్యక్తిగత అవసరాలకోసం వాడుకునే సాధారణ వినియోగదారులైతే, జనరల్ కన్జ్యూమర్ కింద ఉన్న రిజిస్ర్టేషన్ బటన్ను క్లిక్ చేయాలి. ఒకవేళ బల్క్ కన్జ్యూమర్ అయితే దీని కింద ఉన్న రిజిస్ర్టేషన్ బటన్పై క్లిక్ చేయాలి. పేజీ ఓపెన్ అయ్యాక 1, 2, 3, 4 అని నాలుగు అప్షన్స్ కనిపిస్తాయి.
ఆప్షన్-1 మొబైల్ నెంబర్ వెరిఫికేషన్. దీనిని ప్రెస్ చేయగానే.. మీ మొబైల్ నెంబర్ అడుగు తుంది. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. కింద ఉన్న బాక్సులో ఓటీపీ నెంబర్ అని ఉంటుంది. మీరు మొబైల్ నెంబర్ ఇవ్వగానే మీ ఫోన్కు ఒక ఆరు అంకెల ఓటీపీ మెసేజ్ వస్తుంది. ఆ నెంబర్ను ఎంటర్ చేసి, కింద ఉన్న సబ్మిట్ బటన్ నొక్కాలి.
ఆప్షన్-2లో ఆధార్ నెంబర్ అని ఉంటుంది. దీనిని ప్రెస్ చేయగానే.. ఆధార్ నెంబర్ ను అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మీకు 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఆధార్ నెంబర్ ఇచ్చి పక్కనే ఉన్న సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి.
ఆప్షన్ 3లో ప్రజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ ఉంది. దీనిపై క్లిక్ చేయగానే.. మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో కాస్త ఎక్కువ వివరాలను నమోదు చేయాలి. మొదటగా మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మీ జిల్లాను ఎంపిక చేసుకోవాలి. మీరు మునిసిపాలిటీలో ఉంటే దానిని, లేకుంటే మండలాన్ని ఎంపిక చేసుకోవాలి. అందులో ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి గందరగోళం ఉండదు. మీ అడ్రస్ను డోర్ నెంబర్తో సహా తర్వాత బాక్సులో ఇవ్వాలి. పిన్కోడ్ను కూడా తప్పనిసరిగా అడ్రస్ బాక్స్ కింద బాక్సులో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ పూర్తి పేరు. రూరల్ / అర్బన్ ఏదో తెలపాలి. గ్రామ పంచాయితీతో పాటు వార్డు నెంబర్ కూడా ఇవ్వాలి. మీరు ఇచ్చిన చిరునామాకు దగ్గర్లో ఉన్న ల్యాండ్ మార్క్ ఇవ్వాలి. మెయిల్ ఐడీ కూడా ఇచ్చిన తర్వాత కింద ఉన్న సబ్మిట్ బటన్ నొక్కాలి.
ఆప్షన్-4 కన్ఫర్మేషన్ ఆప్షన్ను ప్రెస్ చేయగానే పేజీ ఓపెన్ అవుతుంది. యూజర్ ఐడీ అని అడుగు తుంది. మీరు ఏదైతో ఫోన్ నెంబర్ ఇచ్చారో దానిని ఎంటర్ చేయాలి. దాని కింద ఐ హావ్ యాక్సెప్టెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్న దగ్గర టిక్ చేసి కింద ఉన్న రిజిస్టర్ బటన్ను ప్రెస్ చేస్తే, తర్వాతి పేజీలో ప్రొసీడ్ టు ఆర్డర్ శాండ్ అన్న బటన్ వస్తుంది. దానిని ప్రెస్ చేయగానే ఇసుకను బుక్ చేసుకునేందుకు రిజిస్టర్ అయినట్టే.
తర్వాత ఇసుకను ఇలా బుక్ చేసుకోండి
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మళ్ళీ హోమ్ పేజీలోకి ఆటోమేటిక్గా వస్తారు. రిజిస్ర్టేషన్ పక్కన బుకింగ్స్ ఆప్షన్ ఉంటుంది. దానిని ప్రెస్ చేయాలి. బుకింగ్ ఆప్షన్ను ప్రెస్ చేయగానే ఆన్లైన్ శాండ్ బుకింగ్, ట్రాక్ యువర్ ఆర్డర్ అనే రెండు సబ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మొదటిది ఆన్లైన్ శాండ్ బుకింగ్ను క్లిక్ చేయాలి.
ఓపెన్ అయిన పేజీలో మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. దాని కింద ఉన్న సెండ్ ఓటీపీ బటన్ను ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మీ ఫోన్కు వచ్చే ఓటీపీ నెంబర్ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత దేనికోసమని ప్రత్యేక పేజీలో వివరాలు అడుగుతుంది. ఇందులో కొత్త ఇంటి నిర్మాణమా? మరమ్మత్తుకా? అన్న విషయాన్ని ప్రెస్ చేయాలి. ఆ తర్వాత ఎన్ని ఫ్లోర్లు అని అడుగుతుంది. ఎంటర్ చేశాక ఎన్ని చదరపు అడుగులో అడుగుతుంది.
మీరు ఎన్ని చదరపు అడుగులు ఇస్తారో దానిని బట్టి ఆటోమేటిగ్గా మీకు ఎంత ఇసుక అవసరమో చెబుతుంది. ఉదాహరణకు 1500 చదరపు అడుగులు అని మీరు చె మీకు 85 టన్నుల ఇసుక అవసరమని అంచనా వేసి చెబుతుంది. అయితే ఈ ఇసుకను మొత్తం ఒకేసారి బుక్ చేయటానికి వీల్లేదు. ఒక్కోసారి 20 టన్నులకు మాత్రమే అవకాశం ఉంటుంది. మీకు ఇసుక ఎక్కడ కావాలో సంబంధిత స్టాక్ యార్డును సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాలి.
పేమెంట్ చేయగానే బిల్లింగ్ చూపిస్తుంది. బిల్లింగ్ వచ్చిన తర్వాత వాహనాన్ని మాట్లాడుకుని తరలించుకోవచ్చు సాధారణ వినియోగదారుడు ఏడాదికి 500 మెట్రిక్ టన్నుల ఇసుక బుక్ చేసుకోవచ్చు. బల్క్ కన్జ్యూమర్కు ప్రభుత్వం ఎలాంటి పరిమితిని విధించలేదు. బుక్ చేసుకున్న ఇసుక క్వాలిటీని సంబంధిత శాఖలు సర్టిఫై చేస్తాయి. ఇసుకను బుక్ చేసుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన టన్ను ధరకే అందిస్తారు. రవాణా చార్జీలు అదనం.