కరెంట్ బిల్లు ఎక్కువొస్తే పింఛన్ కట్.. రేషన్ కూడా!

  • Published By: vamsi ,Published On : December 21, 2019 / 01:50 AM IST
కరెంట్ బిల్లు ఎక్కువొస్తే పింఛన్ కట్.. రేషన్ కూడా!

Updated On : December 21, 2019 / 1:50 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్‌, రేషన్‌ కార్డులను తొలగించకుండా ఉంచాలంటే, కొత్తది మంజూరు చేయాలంటే కరెంటు బిల్లులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో 200 యూనిట్‌లు దాటితే రేషన్‌ కట్‌, 300 యూనిట్‌లు దాటితే పెన్షన్‌ కట్‌ నిబంధన ఇప్పుడు పింఛన్ అందుకునేవాళ్లకు, రేషన్ కార్డు దారులకు నిద్ర పట్టనివ్వట్లేదు. కరెంటు బిల్లు ఎక్కువ కడుతున్నారా? లేదా? అనే విషయాలను వాలంటీర్లు సర్వే చేస్తున్నారు.

అయితే రెండు మూడు మీటర్లు ఉన్నా కూడా లెక్క మారిపోతుంది. భార్యభర్తల పేరుమీద ఆధార్‌ కార్డుతో అనుసంధానమై ఉన్న అన్ని సర్వీసులను కలిపి ఒక యూనిట్‌గానే తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. వీటిలో గృహ సర్వీసులతో పాటు వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక సర్వీసులను కూడా కలిపి ఒక యూనిట్‌గా తీసుకోనున్నారు. ఇప్పటివరకు సొంత పట్టా భూముల్లో నిర్మించుకున్న ఇళ్లు మాత్రమే సొంత భవనాల కింద పరిగణించేవారు.

ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యుత్‌ వినియోగం పరిగణలోకి తీసుకుంటే బీఫారాల్లో ఉన్న ఇళ్లు, స్వాధీనాల్లో ఉన్న ఇళ్లు, రోడ్ల పక్కన ఆక్రమించుకొని ఉంటున్న వారు ఈ జాబితాలో చేరుతారు. కారణం విద్యుత్‌ సంస్థలు ఎవరు ఉంటున్నారో వారి పేరు మీదే సర్వీస్‌ మంజూరు చేస్తుంది. దీంతో ఇల్లు బీఫారమని, స్వాధీనమని కుంటి సాకులు చెప్పేందుకు అవకాశం లేదు.

ఇక ఇళ్లను అమ్ముకున్న వాళ్లకు కూడా ఇబ్బందులు తప్పట్లేదు. ఇళ్లు అమ్ముకున్నా విద్యుత్‌ సర్వీసుల పేర్లను మార్చుకోనివారు ఎక్కువగా ఉన్నారు. ఆ విద్యుత్‌ కనెక్షన్‌లు కూడా వారి పేరు మీదకే వచ్చే అవకాశం ఉంది. పొరుగు రాష్ట్రాల్లో ఉండి ఉండి ఊళ్లలో ఇళ్లు ఉన్నవాళ్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అద్దెకు ఉన్నవాళ్లు ఎక్కువ కరెంటు వాడితే ఆ ఎఫెక్ట్ వీళ్ల మీద పడుతుంది.
ఈ విషయమై అధికారులు మాట్లాడుతూ.. అద్దెలు వచ్చే వారికి పెన్షన్‌ అవసరం ఏముంటుంది అని అంటున్నారు. అద్దెకు ఇళ్లు ఇచ్చేస్థాయి ఉంటే వారికి పెన్షన్‌ అవసరమా అని అధికారులు వాదిస్తున్నారు.