వైఎస్ వివేకా హత్యకేసులో ఇద్దరికి నార్కో అనాలసిస్ టెస్ట్లు

తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ఇద్దరు వ్యక్తులకు నార్కో అనాలసిస్ టెస్ట్లను పూర్తి చేశారు అధికారులు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ వివేకా హత్య జరగగా.. ఈ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన సిట్ బృందం దర్యాప్తు చేపట్టింది.
ఇందులో భాగంగా హత్య కేసులో అనుమానితులుగా ఉన్న వివేకానందరెడ్డి సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, వాచ్మన్ రంగయ్య, కసనూరు పరమేశ్వర్రెడ్డి, దిద్దెకుంట శేఖర్రెడ్డిలకు నార్కో అనాలసిస్ టెస్ట్ చేయడం కోసం 20 రోజుల క్రితం సిట్ బృందం పులివెందుల కోర్టు అనుమతి తీసుకుంది.
ఈ క్రమంలోనే గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న ల్యాబ్కు వీరిని తీసుకెళ్లిన సిట్ అధికారులు లేటెస్ట్గా వారికి నార్కో అనాలసిస్ టెస్ట్లు నిర్వహించారు. నార్కో అనాలసిస్ టెస్ట్లు చేసిన తర్వాత వాచ్మన్ రంగయ్యను, గంగిరెడ్డిని కడప పోలీసులు తిరిగి పులివెందులకు తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టారు.
అలాగే పరమేశ్వర్రెడ్డి, శేఖర్రెడ్డిలకు కూడా నార్కో అనాసిస్ పరీక్షలు చేసిన అనంతరం నిందితులు ఏం చెప్పారనే విషయాన్ని పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.