డబ్బులు అనుకుని కొండచిలువలు ఉన్న సంచి దొంగిలించారు

డబ్బులు అనుకుని కొండచిలువలు ఉన్న సంచి దొంగిలించారు

వ్యూహం ప్రకారం.. సంచిని దొంగిలించారు. కానీ, అందులో ఉంది డబ్బులు కాదు కొండచిలువలు. శనివారం సాయంత్రం 4గంటల 30నిమిషాలకు బ్రియాన్ గండీ అనే వ్యక్తి తన పెంపుడు కొండ చిలువలతో ప్రయాణమయ్యాడు. మార్టిన్ లూథర్ కింగ్ లైబ్రరీలో ప్రదర్శన ముగియగానే పార్కింగ్ ఏరియాలోకి వచ్చాడు. 

అతనితో పాటు ఉన్న సంచుల్లో ఒక దానిలో 4 కొండచిలువలు, 1 అడవి జాతి బల్లి ఉన్నాయి. సంచులన్నింటినీ పార్కింగ్ ఏరియాలో ఉంచి తన కారును బయటకు తీసుకొచ్చుకున్నాడు. ఈ గ్యాప్‌లోనే ఓ సంచి మిస్సయిపోయింది.

‘నేను కార్ కోసం ముందుకెళ్లాను. తర్వాత కారు తీసుకువచ్చి సంచులు వేసుకునే ప్రయత్నం చేసేసరికి ఓ బ్యాగ్ మిస్సయిన సంగతి గమనించాను. నేను సంచులు అక్కడ పెట్టి వెళుతున్నప్పుడు ఆ ప్రదేశంలో ఎవరో వ్యక్తులు ఉన్నారు. కానీ, వారిని అనుమానించలేదు. ఒక 45సెకన్ల వ్యవధిలోనే ఇదంతా జరిగిపోయింది’

‘నేను కోరేది ఒక్కటే. బ్యాగ్‌లో ఏదో ఉందనుకుని దొంగిలించి ఉంటారు. అవి పాములు అని తెలిసి చంపేయకండి. మూగ జీవాలను హింసించకూడదు. వాటిని తిరిగి ఇచ్చేయండి’ అని కోరుతున్నాడు. బాధితుడు సీసీటీవీ ఆధారంగా దొంగలను గుర్తించాలని పోలీసులను ఆశ్రయించాడు.