వృద్ధులు, పిల్లలకూ తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతి
Permission for elderly and children to visit Thirumala Srivari : వృద్ధులు, పిల్లల దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తగిన జాగ్రత్తలో వారంతా శ్రీవారి దర్శనానికి రావచ్చని ప్రకటించింది. కరోనా కారణంగా 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, పదేళ్ల లోపు పిల్లలకు దర్శన అనుమతి నిరాకరిస్తూ టీటీడీ గతంలో నిర్ణయించింది.
అయితే వాళ్లను కూడా దర్శనానికి అనుమతించాలంటూ పెద్ద ఎత్తున వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కరోనా దృష్ట్యా భక్తులందరూ తగిన జాగ్రత్తలతో తిరుమల రావాలని సూచించింది. పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్లు ఉండవని, టికెట్లు తీసుకునే దర్శనానికి వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది.
డిసెంబర్ 25 ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ శుక్రవారం (డిసెంబర్ 11, 2020) శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను విడుదల చేసింది. ఉదయం 6.30 గంటల నుంచి టికెట్లు టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం అవకాశం కల్పించనున్నారు. ఈనెల 25 నుంచి జనవరి 3 వరకు వైకుంఠ ద్వారం నుంచి స్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చు. ప్రతి రోజు 20 వేల టికెట్లను అందుబాటులో ఉంచుతున్నారు.
వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తూ ఎక్కువమంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాడానికి అనువుగా శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాన్ని పది రోజుల పాటు తెరచి ఉంచాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో డిసెంబర్ 25న వైకుంఠ ఏకాదశి కావడంతో ఆరోజు నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.