బోయిన్ పల్లి కిడ్నాప్ : తేలనున్నఅఖిల ప్రియ ఫ్యామిలీ భవితవ్యం

బోయిన్ పల్లి కిడ్నాప్ : తేలనున్నఅఖిల ప్రియ ఫ్యామిలీ భవితవ్యం

Akhila Priya Bail Petition : బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అరెస్టైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్‌పై నిర్ణయం మరోసారి వాయిదా పడింది. 2021, జనవరి 22వ తేదీ శుక్రవారం బెయిల్ పై నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఎలాగైనా అఖిలను బయటికి తీసుకురావాలని ఆమె తరపు న్యాయవాదులు పోరాడుతుంటే.. ఆమెను విడిచిపెడితే మొదటికే మోసం వస్తుందంటున్నారు పోలీసులు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బోయిన్‌ పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్‌పై సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి.. అఖిలప్రియ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆమె తరపు న్యాయవాదులు కోర్టును కోరారు.. కేసు దర్యాప్తుకు అఖిలప్రియ పూర్తిగా సహకరిస్తారని కోర్టుకు తెలిపారు. అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు.. బెయిల్‌ మంజూరు చేయొద్దని కోరారు. అఖిలప్రియకు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని.. బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఇంకా చాలా మంది నిందితులు పరారీలోనే ఉన్నారని.. వారందరిని అరెస్ట్‌ చేయాల్సి ఉందన్నారు..

మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవరామ్‌, సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. వీరిద్దరి బెయిల్‌ పిటిషన్లపైనా కూడా పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు.. ఈ పిటిషన్లపై విచారణను కూడా సెషన్స్‌ కోర్టు వాయిదా వేసింది.. దీంతో అఖిలప్రియ, ఆమె కుటుంబ సభ్యుల భవితవ్యం శుక్రవారం తేలనుంది.