నామినేషన్ వేసిన సన్నీ డియోల్
బాలీవుడ్ యాక్షన్ హీరో, గురుదాస్ పూర్ బీజేపీ అభ్యర్థి సన్నీ డియోల్ సోమవారం(ఏప్రిల్-29,2019) నామినేషన్ దాఖలు చేశారు. సోదరుడు బాబీ డియోల్, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు శ్వైత్ మాలిక్, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి కెప్టెన్ అభిమన్యు, అకాళీదళ్ నేత గుర్ బచ్చన్ సింగ్ వెంట రాగా ఆయన ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. పంజాబీ సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన దేవోల్ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు.అంతకు ముందు ఆయన అమృత్సర్ లోని స్వర్ణదేవాలయం, దుర్గియానా మందిరంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో సన్నీ డియోల్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ సునీల్ జఖార్, ఆప్ నేత పీటర్ మాసిహ్ తో సన్నీ దేవోల్ తలపడనున్నారు.1998 నుంచి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ నటుడు వినోద్ ఖన్నా 2017లో మరణించడంతో…ఉపఎన్నికలు జరిగాయి.ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ స్థానంలో విజయం సాధించింది. ఈసారి ఎలాగైనా ఆ సీటును తిరిగి కైవసం చేసుకోవాలని భావిస్తున్నబీజేపీ ఆరు రోజుల క్రితం పార్టీలో చేరిన సన్నీని అభ్యర్థిగా నిలబెట్టింది.