మే 27న పరిషత్ ఓట్ల లెక్కింపు
హైదరాబాద్: రాష్ట్రంలో మూడు విడతల్లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని, ఈనెల 27 కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రశాంతగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డి చెప్పారు. ఈనెల 17 న వనపర్తి జిల్లా పానగల్ మండలం కదిరేపాడు ఎంపీటీసీ స్ధానానికి రీ పోలింగ్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా 32 జిల్లాల్లో 123 సెంటర్ల లో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. 5 వేల 659 స్ట్రాంగ్ రూంలలోని బ్యాలెట్ పేపర్లు తీసుకువస్తామని చెప్పారు. ఒక్కో ఎంపీటీసి కి 2 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. సాయంత్రం 5 లోపు ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని , తర్వాత జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు చేపడతాం అని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డి వివరించారు.
మొదటి విడతలో 195 జెడ్పీటీసీ, 2365 ఎంపీటీసీ.. రెండో విడతలో 199 జెడ్పీటీసీ, 2109 ఎంపీటీసీ.. మూడో విడతలో 124 జెడ్పీటీసీ,1343 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరింగింది. ఇందుకోసం మొత్తం 32 వేల 7 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.