Supreme Court : వ్యాక్సినేషన్ పాలసీలో చాలా లోపాలు..కేంద్రానికి సుప్రీం అక్షింతలు
వ్యాక్సినేషన్ విధానంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
Supreme Court వ్యాక్సినేషన్ విధానంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్ పాలసీలో ఎన్నో లోపాలున్నాయని పేర్కొంది. భిన్న ధరలు, కొరత, గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కరోనా వ్యాక్సిన్ ల కోసం పలు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లపై దృష్టి సారించిన నేపథ్యంలో ఇది ప్రభుత్వ విధానమా అని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
కరోనా పేషెంట్లకు అత్యవసర మెడిసిన్స్,వ్యాక్సిన్లు,మెడికల్ ఆక్సిజన్ సరఫరాపై సోమవారం జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. కేవలం 45 ఏళ్లు పైబడిన వారికే వ్యాక్సిన్లు అందించే బాధ్యత కేంద్రం తీసుకుందని, 18- 44 ఏళ్ల వాళ్లకు టీకా ఇచ్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ హాస్పిటల్స్ కు ఎందుకు వదిలేశారని కేంద్రాన్నిసుప్రీంకోర్టు ప్రశ్నించింది. కరోనా సెకండ్ వేవ్లో 18 నుంచి 44 ఏళ్లలోపు వారే ఎక్కువగా కరోనా బారిన పడ్డారని కోర్టు పేర్కొంది. 45 ఏళ్లు పైబడిన వారికే కాకుండా అందరికీ టీకాలు ఇస్తే బాగుండేదంటూ కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.
వ్యాక్సిన్ల ధర నిర్ణయించే అధికారం తయారీ సంస్థలకే ఎందుకు వదిలేశారంటూ ప్రశ్నించింది సుప్రీం. వ్యాక్సిన్ల ధరలను కేంద్రానికి ఒక రేటు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక రేటు , ప్రైవేటు ఆస్పత్రులకు మరో రేటు పెట్టడం వెనుక సహేతుక కారణం కనిపించడం లేదని కోర్టు అభిప్రాయపడింది. వ్యాక్సిన్ల ధర నిర్ణయించే అధికారం తయారీ సంస్థలకే ఎందుకు వదిలేశారంటూ ప్రశ్నించింది సుప్రీం. మరోవైపు కేంద్రం ఉండగా రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా వ్యాక్లిన్ల కోసం గ్లోబల్ టెండర్లకు వెళ్లడం ఏంటని నిలదీసింది.
ఇక, టీకా తీసుకోవాల్సిన వారు.. కొవిన్ యాప్లో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలన్న ప్రభుత్వ నిబంధనలను సుప్రీం ప్రశ్నించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలందరికీ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉందా ? వారు కోవిన్ యాప్లో ద్వారా టీకా పొందడం సాధ్యమేనా అని ప్రశ్నించింది. ఇదే విషయం వలస కార్మికులకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని.. కోవిన్ యాప్లో వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్పై పునరాలోచించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది.
వచ్చే డిసెంబర్ నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇస్తారా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే ఈ ఏడాది చివరి నాటికి అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తామని సుప్రీంకోర్టుకు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. టీకాల కోసం అమెరికాకు చెందిన ఫైజర్ సంస్థతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోందన్నారు. చర్చలు ఫలిస్తే.. వ్యాక్సినేషన్ పూర్తయ్యే గడువులో మార్పులు జరగవచ్చన్నారు.