కీచకుడు : విద్యార్ధినిపై ఉపాధ్యాయుడి కాల్పులు
విద్యా బుధ్ధులు నేర్పించి ప్రయోజకులను చేయాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారి బాలిక పాలిట యముడయ్యాడు. స్కూల్ నుంచి తిరిగి వెళుతున్న బాలికను తుపాకితో విచక్షణా రహితంగా కాల్చి చంపాడు.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో శైలేంద్ర రాజ్పుత్ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. అదే పాఠశాలలో 8వ తరగతికి చదువుతున్న ఓ బాలికపై కన్నేశాడు. కొద్ది కాలంగా ఆ బాలికను లైంగికంగా వేధించసాగాడు. ఈ విషయాన్ని ఆమె తల్లి తండ్రులకు, హెడ్ మాస్టర్ కు చెప్పింది. బాలిక ఫిర్యాదుతో, విద్యాశాఖ అధికారుల ఆదేశాలతో, స్కూల్ హెడ్ మాస్టర్ రాజ్పుత్ ను 3నెలల పాటు సస్పెండ్ చేశారు.
దీంతో బాలికపై పగ పెంచుకున్నాడు శైలేంద్ర రాజ్ పుత్. గురువారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న బాలికపై 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. అందులో ఓ బుల్లెట్ మెడకి తగలడంతో బాలిక కుప్పకూలిపోయింది. కాల్పులు అనంతరం అక్కడి నుంచి రాజ్ పుత్ పరారయ్యాడు. రక్తపు మడుగులో పడిపోయిన బాలికను స్ధానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. కాగా ఈ ఘటనపై ఆగ్రహించిన గ్రామస్తులు పాఠశాలపై దాడి చేసి నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.